హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు అనుకూల పథకాలు దేశానికే ఆదర్శమని ఉమ్మడి ఏపీ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల వైవిధ్యీకరణ తప్పనిసరని, వరి సాగు నుంచి పప్పు, నూనె గింజల సాగు వైపు మళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం రైతాంగాన్ని ప్రోత్సహించడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు.
1985 – 1989 మధ్యకాలంలో నూనెగింజలు, అపరాల సాంకేతిక మిషన్ పథకం తరహాలో ప్రస్తుతం అపరాలు, నూనె, పప్పుగింజల సాగుకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, విదేశాలకు ఎగుమతులను ప్రోత్సహించేందుకు అవసరమైన వసతులు కల్పించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించి అధిక ధర పొందడానికి చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు మహిళా రైతు ఉత్పత్తి సంస్థలకు సహకారం అందించాలన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల విషయంలో అవలంభిస్తున్న లోపభూయిష్ట విధానాలతో రైతులకు తీవ్రంగా అన్యాయం జరుగుతోందన్నారు.
స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు పంటల ఉత్పత్తులకు సీ2+50 ఫార్ములా ప్రకారం.. కనీస మద్దతు ధర లభించేలా చట్టబద్ధత కల్పించినప్పుడే రైతుకు న్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర రాష్ట్రాల సీఎంలను కలుపుకుని వ్యవసాయం విషయంలో ప్రపంచ వాణిజ్య సంస్థ అనుసరిస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యతిరేకంగా ఉన్న నియమాల్లో మార్పును తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు అనుకూలంగా డంకెల్ డ్రాఫ్ట్ రచించుకుని ఆయా దేశాల ఉత్పత్తులకు అధిక ధరలు వచ్చేలా, ఆయా దేశాల రైతులు లాభపడేవిధంగా విధానాలు రూపొందించుకున్నారన్నారు.
భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల రైతులకు మద్దతు ధర ఇవ్వొద్దని, మద్దతు ధర ఇచ్చే ఉత్పత్తులు కొనుగోలు చేయమని, రైతులకు సబ్సిడీలు ఇవ్వొద్దని ఆంక్షలు విధిస్తున్నారన్నారు. దీంతో దేశ వ్యవసాయరంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని, అంతర్జాతీయంగా ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం రైతుల తరఫున పోరాడకుండా రైతుల నడ్డి విరిచే కొత్త, కొత్త వ్యవసాయ చట్టాలు తెస్తూ కార్పోరేట్ల కొమ్ముగాస్తూ దేశ వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తుండడం దురదృష్టకరమన్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్లాలని మంత్రి నిరంజన్రెడ్డిని కోరారు. స్వయంగా కలిసి వెల్లడించేందుకు సమయం కుదరడం లేదని, ఆరోగ్యం సహకరించడం శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.