ఐదు విలీన గ్రామాల తీర్మానం
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని భద్రాచలం సమీపంలో ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు తీర్మానించాయి. ప్రస్తుతం ఈ ఐదు గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం భద్రాచలం నియోజకవర్గలోని భద్రాచలం రూరల్ మండలం, కూనవరం, వీఆర్పురం, చింతూరు మండలాలు, అలాగే పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలు, ఆశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని కుకునూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు. వీటితో పాటు భద్రాచలం మండలంలోని ఐదు గ్రామాలు సైతం ఏపీ పరిధిలోకి వెళ్లాయి.
గోదావరికి భారీ వరద వస్తే భద్రాచలం పట్టణానికి వరద ముప్పు ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఐదు గ్రామాలను తెలంగాణకు కేటాయిస్తే ఆయా గ్రామాల నుంచి కరకట్ట నిర్మించి.. గోదావరి వరదల నుంచి భద్రాచలం పట్టణానికి శాశ్వత రక్షణ కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. ఇటీవల గోదావరికి వరదలు పోటెత్తిన నేపథ్యంలో భద్రాచలం పట్టణం ముంపునకు గురైంది. భద్రాచలం పట్టణానికి ముంపు లేకుండా ఉండేందుకు ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఏపీకి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఆయా గ్రామాల పంచాయతీలు తెలంగాణలో కలపాలంటూ తీర్మానం చేసి, ఏపీ ప్రభుత్వానికి పంపాయి.