హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎస్ అబద్ధాల కోరు అని, ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి సీమ ప్రాజెక్టు పనులు చేయించారని ఎన్జీటీలో పిటిషన్ దాఖలైంది. సీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని సవాల్ చేస్తూ నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ను విచారించడంతోపాటు ఉల్లంఘనలు జరిగాయో లేదో? క్షేత్రస్థాయిలో సందర్శించి నివేదిక అందించాలని కేఆర్ఎంబీని ఎన్జీటీ ఆదేశించడం, ఆ మేరకు వారు నివేదికను సమర్పించిన విషయం విదితమే. శుక్రవారం ఆ కేసు విచారణ జరుగనుండగా.. పిటిషనర్ శ్రీనివాస్ గురువారం మరో అఫిడవిట్ను దాఖలు చేశారు.
ఏపీ సీఎస్, అధికారులు మొదటినుంచీ ఎన్జీటీని తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారను. సీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్ను రూపొందించేందుకే సర్వే చేస్తున్నామని, తవ్వకాలు చేస్తున్నామని చెప్పడం పూర్తి అవాస్తవమని, ప్రాజెక్టు పనుల్లో 30 శాతానికిపైగా పూర్తయ్యాయని నివేదించారు. డీపీఆర్ తయారీకి మించి ప్రాజెక్టు పనులను పూర్తి చేశారని కేఆర్ఎంబీ తన నివేదికలో సైతం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఉత్తర్వులను ఉల్లంఘించి పనులను చేపట్టిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోర్టును తప్పుదారి పట్టించేలా రెండుసార్లు ప్రమాణపత్రం దాఖలు చేసిన ఏపీ సీఎస్ది క్రిమినల్ ధిక్కరణగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
నిబంధనల మేరకే పనులు చేశాం: ఏపీ
పర్యావరణ నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించలేదని, డీపీఆర్ తయారీకి మాత్రమే పనులు చేశామని ఏపీ మరోసారి బుకాయించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్దాస్ ఎన్జీటీలో అఫిడవిట్ దాఖలుచేశారు. జియాలజిస్ట్ల సూచనల మేరకు, అ క్కడి నేల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని పనులు చేశామని, అవి కోర్టు ధిక్కరణ పరిధిలోకి రావని పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ నిబంధనలను ఉటంకిస్తూ ఏకంగా 200 పేజీల అఫిడవిట్ను ఎన్జీటీకి సమర్పించా రు. నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే కఠినచర్యలు తీసుకుంటామని ఏపీ సీఎస్తోపాటు ప్రభుత్వాన్ని ఎన్జీటీ గతంలోనే తీవ్రంగా హెచ్చరించిన నేపథ్యంలో శుక్రవా రం జరిగే విచారణపై ఆసక్తి నెలకొన్నది.