హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రెండు నెలల్లో లోక్సభ రద్దు కావడం ఖాయమని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ చెప్పారు. లోక్సభకు నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పారు. ఇండియా కూటమి బలపడుతుందన్న భయంతో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ను కేంద్రం తెరపైకి తెచ్చిందని అన్నారు.
గురువారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీని గద్దె దింపేందుకు ఇం.డి.యా కూటమిలో భావ సారూప్యత కలిగిన పార్టీలు కలుస్తున్నాయని చెప్పారు. మోదీ సర్కార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వంటగ్యాస్పై రూ.200 తగ్గించిందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500కే సిలిండర్ సరఫరా చేస్తామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఉన్నాయని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం నవరత్నాల పేరతో రూ.2.50 లక్షల కోట్లు స్వాహా చేసిందని ఆరోపించారు.