హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): అమెరికాలో ఏడాది క్రితం జరిగిన నా కుమారుడి మరణంపై అనుమానం ఉంది.. దీనిపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయండి.. అంటూ మృతుడి తండ్రి ఇటీవల ఏపీ సీఐడీ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు సీఐడీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం. ఈ కేసులో మృతుడి భార్య సాయిచరణి, మామ సుఖవాసి శ్రీనివాసరావు, అత్త రాజశ్రీని నిందితులుగా చేరుస్తూ సీఐడీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. మృతుడి తండ్రి బాబూరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరుకు చెందిన గంగూరి బాబూరావు కుమారుడు శ్రీనాథ్. శ్రీనాథ్కు సాయిచరణితో 2016 డిసెంబర్లో వివాహం జరిగింది. అనంతరం 2017 జనవరిలో భార్యాభర్తలు అమెరికాకు వెళ్లారు. కొద్దికాలానికే తన కొడుకుతో వివాహం తనకిష్టం లేదంటూ కోడలు తరచూ చెప్పేదని బాబూరావు తెలిపారు. పలుమార్లు తన కొడుకును ఇబ్బందుల పాలుచేసిందని ఆరోపించారు. పిల్లలు పుట్టకుండా తన కోడలు చరణి మెడిసిన్ వాడేదని, పిల్లలు పుడితే తన అందం తగ్గుతుందని తన కొడుకుతో చెప్పేదని, తనకు పెళ్లి కాలేదని చెప్తూ రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్టింగ్లు పెట్టేదని బాబూరావు తెలిపారు. ఎప్పటికైనా నిన్ను చంపేస్తాను.. అని తన కొడుకును బెదిరించేదని, దీనిపై తన వియ్యంకుడితో చర్చిస్తే తమ కుమార్తెకు సర్ది చెప్తామని ఆనాడే హామీ ఇచ్చారని బాబూరావు చెప్పారు.
నిరుడు అక్టోబర్ 16న తన అత్తామామలకు ఫోన్ చేసి శ్రీనాథ్ చనిపోయాడని చరణి సమాచారం ఇచ్చింది. దీంతో బాబూరావు దంపతులు, వియ్యంకుడు శ్రీనివాసరావుతో కలిసి అమెరికా వెళ్లారు. అకడ కుమారుడి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమాలకు హాజరుకాని చరణి, తన తల్లిదండ్రులనూ తొలుత ఇంటిలోకి అనుమతించలేదు. శ్రీనాథ్ ఎలా చనిపోయాడని శ్రీనాథ్ తల్లిదండ్రులు ప్రశ్నించగా, తామిద్దరం రెండురోజుల యోనోహిల్స్కు ట్రెకింగ్కు వెళ్లామని, మొదటి రోజు బాగానే తిరిగి వచ్చామని, రెండోరోజు కాలు జారీ శ్రీనాథ్ లోయలో పడిపోయాడని చెప్పింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చావా అని అడిగితే.. తానివ్వలేదని, సమీపంలోని అమెరికా జంట పోలీసులకు సమాచారమిచ్చారని తెలిపింది. అకడే కొద్దిరోజులు ఉన్న బాబూరావు దంపతులు కుమారుడి మరణం గురించి విచారించారు. బంధువులు, మిత్రుల ద్వారా పలు రకాలుగా సమాచారం సేకరించిన బాబూరావు చివరకు కొడుకుది అనుమానాస్పద మరణమని నిర్ధారణకు వచ్చి అమెరికాలో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అకడే ఉన్న కోడలి తండ్రి సుఖవాసి వీరిపై ఒత్తిడి తెచ్చి, బెదిరించి ఇండియాకు పంపించారు. ఈ నేపథ్యంలో ఏపీకి వచ్చిన బాబూరావు ఇటీవల సీఐడీని ఆశ్రయించడంతో తాజాగా కేసు నమోదు చేశారు.