హైదరాబాద్, జనవరి 10 : పెండింగ్లో ఉన్న రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ బుధవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శుల (సీఎస్)తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నది. తొలుత ఈ సమావేశాన్ని ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, కొవిడ్ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్గా మార్పు చేశారు. ఎజెండాను ఖరారు చేస్తూ కేంద్ర హోంశాఖ రెండు రాష్ర్టాల సీఎస్లకు నోటీసులు పంపించింది. 2021 ఏప్రిల్ 7 తర్వాత రెండు రాష్ర్టాల అధికారులతో కేంద్రం సమావేశం నిర్వహించడం ఇదే ప్రథమం. కరోనా పేరుతో కేంద్రం 8 నెలల పాటు సమావేశాలు నిర్వహించకపోవడంతో షెడ్యూల్ 9,10 సంస్థల విభజనతో పాటు అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి.
కేంద్రం పంపిన ఎజెండాలో ఏపీ కుయుక్తులు!
తెలంగాణలోని భూములు, ఆదాయంపై కన్నేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారానికి ముందుకు రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో ఏయే సంస్థలను ఏవిధంగా పంపిణీ చేసుకోవాలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ., మొండివాదనలు, గొంతెమ్మ కోరికలతో ఏపీ ప్రభుత్వం జటిలం చేస్తున్నది. గత నవంబర్ 14న తిరుపతిలో నిర్వహించిన సదరన్ జోనల్ కౌన్సిల్లో పెండింగ్ సమస్యలను తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ సానుకూలంగా స్పందించలేదు. తాజాగా కేంద్రం పంపిన ఎజెండాను చూస్తే.. ఆంధ్రప్రదేశ్ అలవికాని డిమాండ్లు పెట్టినట్టు అర్థమవుతున్నది. హైదరాబాద్ ఆదాయంలో తమకు వాటా కావాలని, ఈ మేరకు చట్ట సవరణ చేయాలని వితండవాదనలు చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని పన్ను బకాయిలు మరియు వాపస్కు సంబంధించిన సెక్షన్ 50, 51 8ఎస్ 56కు సవరణలు చేయాలని ఏపీ కోరుతున్నది. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అర్థం లేని డిమాండ్ను కేంద్రం ఎజెండాలో చేర్చడం గమనార్హం. 2014 జూన్ 2న రాష్ట్ర విభజన తేదీ నాటికి ఉమ్మడి ఖాతాలో ఉన్న నగదును తెలంగాణకు 42 శాతం, ఏపీకి 58 శాతం చొప్పున పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ, తెలంగాణకు ఇవ్వాల్సిన వాటాను ఇప్పటికీ ఇవ్వలేదు. పైగా విద్యుత్తు సంస్థలకు చెందిన బకాయిలు తమకు వస్తాయని ఏపీ బుకాయిస్తున్నది. రాష్ట్ర విభజన నాటికి ఖజానాలో ఉన్న సొమ్ము నుంచి విద్యుత్తు బకాయిలను తీసేసినా దాదాపు రూ. 4 వేల కోట్లకు పైగా తెలంగాణకే ఏపీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నయాపైసా ఇవ్వడం లేదు. రాష్ట్ర విభజన అనంతరం 2015 వరకు రేషన్ బియ్యం పంపిణీ కింద కేంద్రం నుంచి వచ్చిన సబ్సిడీ మొత్తాన్ని కూడా ఏపీ తన ఖాతాలోనే వేసుకొన్నది. ఆ సొమ్మునూ తెలంగాణకు ఇవ్వడం లేదు.
ఢిల్లీలోని తెలంగాణభవన్ నుంచి సంస్థల విభజన వరకు అన్నింటిపై మడత పేచీలే!
ఢిల్లీలోని తెలంగాణభవన్ విభజనపై ఏపీ ప్రభుత్వం మడత పేచీ పెడుతున్నది. వాస్తవానికి నిజాం నవాబులు ఢిల్లీలో నిర్మించిన హైదరాబాద్ హౌస్ను తీసుకొన్న కేంద్రం దానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చిన స్థలంలోనే ఏపీభవన్ నిర్మించారు.
తెలంగాణకు వారసత్వంగా వచ్చిన ఆస్తిలో తమకు వాటా కావాలని ఏపీ బుకాయిస్తున్నది. తెలంగాణ కొంగుబంగారం సింగరేణిపై కన్నేసింది. సింగరేణి అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ హెవీ మిషన్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (ఏపీహెచ్ఎంఈఎల్) విజయవాడలో ఉన్నందున తమకే వస్తుందని బుకాయిస్తున్నది. ఈ వ్యవహారం అపరిష్కృతంగా ఉన్నది. 9వ షెడ్యూల్లోని దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్), హౌసింగ్బోర్డు, ఆర్టీసీ లాంటి సంస్థలకు హైదరాబాద్లో ఉన్న ఆస్థులపై కన్నేసిన ఏపీ.. వాటిలో వాటా ఇవ్వాలని అసంబద్దంగా వాదిస్తున్నది. ఇలా దాదాపు 23 సంస్థలపై ఏపీ ప్రభుత్వం పేచీలు పెడుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ) బోర్డులో తెలంగాణకు సరైన ప్రాతినిథ్యం దక్కలేదు. మెజార్టీగా ఉన్న ఏపీ సభ్యులు సంస్థ మొత్తం తమకు దక్కుతుందని ఏకపక్షంగా తీర్మానాలు చేశారు. దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. బోర్డును తిరిగి పునర్ నిర్మించి విభజనపై తీర్మానం చేయాలని డిమాండ్ చేసింది. ఈ సమస్య ఇంకా పెండింగ్లోనే ఉన్నది. ఎస్ఎఫ్సీకి హైదరాబాద్లో 450 ఎకరాల భూమిని నాటి ఉమ్మడి సర్కారు కేటాయించింది. ఈ భూమిని ఆర్థిక సంస్థ నిరుపయోగంగా ఉంచడంతో నిబంధనల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తీసుకొన్నది. దీనిపై ఏపీ పేచీలు పెట్టి, కోర్టుకెక్కింది. 10వ షెడ్యూల్ సంస్థలు ఏ భూభాగంలో ఉంటే ఆ రాష్ర్టానికే చెందుతాయని విభజన చట్టం స్పష్టంచేసింది. కానీ హైదరాబాద్లో ఉన్న పదవ షెడ్యూల్ సంస్థపై ఆంధప్రదేశ్ పేచీలు పెట్టడం గమనార్హం.
ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలు
బుధవారం నిర్వహించనున్న సీఎస్ల సమావేశానికి కేంద్ర హోంశాఖ పంపిన ఎజెండా.. ద్వైపాక్షిక సమస్యలు