మునుగోడు: మోడీ, బోడి, ఈడీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపును ఆపలేరని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నారు. ఎన్ని కోట్లు డబ్బులు పంచినా తెలంగాణ ప్రజల గుండెల్లో సీఎం కేసీఆర్ స్థానం స్థిరంగా ఉంటుందని చెప్పారు. మునుగోడు మండలంలోని సింగారంలో కౌశిక్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. దీనిని జీర్ణించుకోలేని బీజేపీ సర్కారు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
రూ.18 వేల కోట్లకోసం బీజేపీకి అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నికకు కారణమయ్యారని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని స్పష్టం చేశారు. తమ స్వార్థం కోసం ప్రజల అభిమానాన్ని సొమ్ము చేసుకునే కోమటిరెడ్డి లాంటివారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.