Criminals : సైబరాబాద్ పోలీసులు (Cyberabad police) అంతర్రాష్ట్ర చిన్నారుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు చేశారు. గుజరాత్ నుంచి పసిపిల్లలను అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో లక్షల రూపాయలకు విక్రయిస్తున్న ముఠా సభ్యులను గుర్తించి అరెస్టు చేశారు. సైబరాబాద్ స్పెషల్ పోలీస్ టీమ్స్.. గుజరాత్కు చెందిన ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతూ ఈ అక్రమ రవాణా వ్యవహారాన్ని గుర్తించారు.
యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో నిందితులను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పసిపిల్లలను రక్షించి సురక్షిత కేంద్రాలకు తరలించారు. ఈ వ్యవహారంలో కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ముఠాకు మరిన్ని లింకులు ఉన్నాయనే అనుమానంతో గుజరాత్ పోలీసులతో సమన్వయం చేస్తూ విచారణ చేపట్టారు. చిన్నారుల అక్రమ రవాణాకు సంబంధించి ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే 100 లేదా 1098 చైల్డ్ హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.