హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రైతు వ్యతిరేక విధానాలను వీడాలని, ధాన్యం సేకరణ బాధ్యతలు ప్రైవేట్కు అప్పగింత, ఎరువుల సబ్సిడీ నగదు బదిలీ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టీ సాగర్ మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఎఫ్సీఐ సహా కేంద్ర ప్రభుత్వ కొనుగోలు సంస్థలను రద్దు చేయాలని, ప్రస్తుతం రాష్ర్టాలకు కేంద్రం ఇస్తున్న సబ్సిడీని నగదు రూపంలో చెల్లించాలని సూచించిన శాంతకుమార్ కమిటీ నివేదికను ప్రధాని మోదీ క్రమంగా అమల్లోకి తెస్తున్నారని మండిపడ్డారు. ఈ విధానాల వల్ల దేశంలో రైతుల ఉత్పాదకత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.