హైదాబాద్, జనవరి 25 : గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మరో అర్భ న్ ఫారెస్ట్ పార్క్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారం కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో ప్రాణవాయువు అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా నగరాలకు, పట్టణాలకు దగ్గర్లో ఉండే రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో అర్బన్ లంగ్ స్పేస్లుగా అర్భన్ ఫారెస్ట్ పార్క్ లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు హైదరాబాద్కు నలువైపులా వీటిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఒత్తిడిని అధిగమించేందుకు, యాంత్రిక జీవనం నుంచి కొద్దిసేపు ఆటవిడుపుగా గడిపేందుకు, స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్క్లు దోహదం చేస్తాయని తెలిపారు.
గాజులరామారం రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ లోని 454 ఎకరాల విస్తీర్ణంలో రూ. 11.37 కోట్ల అంచనా వ్యయంతో ప్రాణవాయువు అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారని మంత్రులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.