కోటా(రాజస్థాన్), ఫిబ్రవరి 13: రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేండ్లుగా జేఈఈకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి ఫలితాలు వచ్చిన మరుసటి రోజైన మంగళవారం తన హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్కు చెందిన శుభ్ చౌదరి (16) రెండేండ్లుగా జేఈఈ-మెయిన్స్కు సిద్ధమవుతున్నాడు. కోటాలోని జవహర్నగర్లోని హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. సోమవారం జేఈఈ మెయిన్ కీ వచ్చింది. దానిని చూసుకున్న శుభ్.. ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదని మనస్తాపానికి గురయ్యాడు. హాస్టల్లోని తన గదికి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు శుభ్కు ఫోన్చేయగా, ఎంతకూ స్పందించకపోవడంతో వారు హాస్టల్ వార్డెన్ను అలర్ట్ చేశారు. పోలీసుల సాయంతో విద్యార్థి గది తలుపులు బద్దలు కొట్టి చూడగా, సీలింగ్ ప్యాన్కు ఉరేసుకొని విగతజీవిగా శుభ్ కనిపించాడు. ఎడ్యుకేషన్ హబ్గా పేరుగాంచిన కోటాలో జనవరి నుంచి ఇప్పటివరకు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గత ఏడాది 26 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.