హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): కృషి కో-ఆపరేటివ్ అర్బ న్ బ్యాంక్ నుంచి ఇప్పటికీ డబ్బులు అందని డిపాజిటర్లు మరోసారి సెటిల్మెంట్ క్లెయిమ్ చేసుకునేందుకు సీఐడీ పోలీసు విభాగం అవకాశం కల్పించినట్టు బుధవారం డీజీపీ కార్యాలయం ప్రకటించింది. డిపాజిటర్లకు చెల్లింపులు పూర్తి చేయకుండా ఈ బ్యాంకు 2001లో అర్ధాంతరంగా బోర్డు తిప్పేసిన విషయం విదితమే. దీనిపై కొందరు డిపాజిటర్ల ఫిర్యాదు మేరకు మహంకాళి పీఎస్లో క్రిమినల్ కేసు నమోదవడంతో సీఐడీ పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ బ్యాంకు ఆస్తులను, డైరెక్టర్ల ఆస్తులను అటాచ్ చేశారు.
వీటిలో కొన్ని ఆస్తులను విక్రయించి బాధిత డిపాజిటర్లకు డబ్బులు చెల్లించాలని గతంలో కోర్టు ఆదేశించడంతో ఇప్పటివరకు 700 మంది డిపాజిటర్లకు డబ్బులు చెల్లించారు. ఇంకా 100 మందికిపైగా డిపాజిటర్లకు డబ్బులు అందకపోవడంతో క్లెయిమ్ దరఖాస్తులు చేసుకునేందుకు సీఐడీ పోలీసులు మరో అవకాశాన్ని కల్పించారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను, ఇతర రుజువులను తమకు అందజేయాలని, మరిన్ని వివరాల కోసం 91001 15627, 9440700870 నంబర్లను సంప్రదించాలని డీజీపీ కార్యాలయం తెలిపింది.