హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ఫోన్ట్యాపింగ్ వ్యవహారం కేసులో మరో అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన విచారణాధికారులు టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావును గురువారం రాత్రి అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా రాధాకిషన్రావుతోపాటు గతంలో ఎస్ఐబీలో సీఐగా పనిచేసిన గట్టు మల్లును కూడా ఉదయమే అదుపులోకి తీసుకొన్న పోలీసులు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఇద్దరినీ రాత్రి వరకు విచారించారు. అనంతరం రాధాకిషన్రావును అరెస్టు చేసినట్టు ప్రకటించారు. గతంలో గట్టు మల్లు ఎస్ఐబీలో సీఐగా పనిచేసినందున మాజీ డీఎస్పీ ప్రణీత్రావుతో ఉన్న సంబంధాలు, ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్రావు, గట్టు మల్లు పాత్రపై దర్యాప్తు అధికారులు సుధీర్ఘంగా ప్రశ్నించినట్టు సమాచారం. ఈ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను ఐదు రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. శుక్రవారం వారిని చంచల్గూడ జైలు నుంచి దర్యాప్తు అధికారుల కార్యాలయానికి తరలిస్తారు. విచారణ చేపట్టిన అనంతరం వారినుంచి సేకరించే సమాచారం మేరకు మరికొందరిని అదుపులోకి తీసుకోనున్నారు. ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశమున్నదని దర్యాప్తు అధికారులు తెలిపారు.
ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావును మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కన్నయ్యలాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఏడు రోజుల కస్టడీకి అప్పగించగా, రెండోసారి అప్పగించడం చట్టవ్యతిరేకమంటూ నిందితుల తరఫు న్యాయవాది సుదీర్ఘ వాదనలను ఏకీభవించిన కోర్టు పిటిషన్ను తిరస్కరించింది. ఏసీపీ వెంకటగిరి సమక్షంలో కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది.