హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ బ్యాంకింగ్, ఫైనాన్స్ దిగ్గజం గోల్డ్మన్ శాక్స్ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు బుధవారం న్యూయార్క్లోని గోల్డ్మన్ శాక్స్ కేంద్ర కార్యాలయంలో చైర్మన్, సీఈవో డేవిడ్ ఎం సాల్మన్ బృందంతో సమావేశమయ్యారు. అనంతరం సంస్థ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. హైదరాబాద్ నగరంలో తమ కార్యకలాపాలను పెద్ద ఎత్తున విస్తరించనున్నామని తెలిపింది. తమ ప్రణాళికలో భాగంగా ప్రస్తుతమున్న తమ కార్యకలాపాలను రెండు రెట్లు పెంచి 2000 మంది నిపుణులకు అదనంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఇందుకోసం సుమారు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ కార్యాలయాన్ని విస్తరించనున్నది. బ్యాంకింగ్ సేవలు, బిజినెస్ అనలిటిక్స్, ఇంజినీరింగ్ వంటి వివిధ రంగాలలో గోల్డ్మన్ శాక్స్ కార్యకలాపాల బలోపేతం కోసం ఈ నూతన కేంద్రం పనిచేయనున్నది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ విభాగాల్లోనూ ఈ నూతన కార్యాలయం దృష్టి సారిస్తుందని తెలిపింది. హైదరాబాద్ నగరంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు అనుకూల వాతావరణం ఉన్నదని, దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు, హైదరాబాద్ నగరంలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని బట్టి తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నట్టు సంస్థ చైర్మన్ సాల్మన్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో తమ నూతన కార్యాలయం, ఇన్నోవేషన్ లక్ష్యాలకు, కార్యకలాపాలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. జూలై 2021లో గోల్డ్మన్ శాక్స్ హైదరాబాద్ నగరంలో తన కార్యకలాపాలు ప్రారంభించింది. తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న హైదరాబాద్ కార్యాలయం సంస్థాగతంగా అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్నదని సంస్థ చైర్మన్ ప్రశంసించారు. ఈ విస్తరణతో హైదరాబాద్ నగరంలో తమ సంస్థ సిబ్బంది సంఖ్య మూడు రెట్లు అవుతుందని తెలిపారు.
హైదరాబాద్ నగరాన్ని అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక, బ్యాంకింగ్, ఫైనాన్స్ సేవల్లో అత్యంత ప్రతిష్ఠ కలిగిన మాస్ మ్యూచువల్, హెచ్ఎస్బీసీ, స్టేట్ స్ట్రీట్, బెరాడియా వేల్స్ ఫార్గో, జేపీ మోర్గాన్ వంటి కంపెనీలు హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున తమ కార్యకలాపాలను విస్తరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ రోజు గోల్డ్మన్ శాక్స్ సంస్థ విస్తరణ ప్రణాళికలు ప్రకటించడం ద్వారా ఈ రంగంలో హైదరాబాద్ స్థానం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ విస్తరణ ప్రణాళికలో భాగంగా 2000 మంది అత్యంత నైపుణ్యం కలిగిన యువకులకు ఉద్యోగాలు లభించనుండడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నగరాన్ని తన విస్తరణ కోసం ఎంచుకున్న సంస్థ ప్రతినిధుల బృందానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.