హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): సింగరేణి సోలార్కు మరో జాతీయ పురస్కారం దక్కింది. అతితక్కువ సమయంలో పర్యావరణహితంగా 224 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను నిర్మించి, పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించినందుకు ‘రెనివ్ ఎక్స్’ అవార్డుల్లో ‘ఉత్తమ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇయర్ అవార్డు-2023’ లభించింది. శనివారం హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో రెన్యువబుల్ ఎనర్జీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అజయ్ మిశ్రా.. సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణకు ఈ అవార్డును అందజేశారు. ప్రస్తుతం 9 ప్లాంట్ల నుంచి 615 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న సింగరేణి.. 2024 చివరినాటికి పూర్తిగా సౌర విద్యుత్తుపై నడుస్తున్న సంస్థగా రూపుదిద్దుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. మరోవైపు నీటిని అత్యంత పొదుపుగా వినియోగిస్తున్నందుకు సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం ఇటీవల ‘బెస్ట్ వాటర్ ఎఫిషియెంట్ ప్లాంట్’ అవార్డును కైవసం చేసుకున్నది. దీంతో అనతికాలంలోనే సింగరేణికి 2 అవార్డులు రావడంపై సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని, భవిష్యత్తులో సింగరేణికి మరిన్ని అవార్డులు తీసుకురావాలని ఆకాంక్షించారు.
సింగరేణి అడిషనల్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)గా రాజేశ్వరరావు చేసిన సేవలు మరువలేనివని జీఎం సురేశ్ కొనియాడారు. పదవీ విరమణ చేసిన రాజేశ్వరరావుకు శనివారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ.. నిబద్ధతకు రాజేశ్వరరావు మారుపేరని కొనియాడారు. కార్యక్రమంలో అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ ఎన్వీ రాజశేఖర్రావు, అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ భాస్కర్, ప్రజాకవి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.
నేటి ఆధునిక జీవన శైలిలో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ గొప్ప సాధన అని జీఎం సురేశ్ తెలిపారు. సింగరేణి ఉద్యోగులకు ఈనెల 26 నుంచి నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి సుదర్శన క్రియ శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ.. పని ఒత్తిడిని జయించడంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో యోగా గురువులు రవికుమార్, వైశాలి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు దత్తాత్రేయ కులకర్ణి, వనిత తదితరులు పాల్గొన్నారు.