మెట్పల్లి, ఫిబ్రవరి 21: ఆరుగాలం కష్టపడి పండించిన పసుపు పంటకు మద్దతు ధర కోసం రైతులు మరోసారి ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి క్వింటా ల్ పసుపునకు రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 3 నుంచి మహా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు సోమవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన రైతు వేదిక నాయకులు సమావేశమై తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. జగిత్యాల రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి, నాయకులు మామి డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కనీస మద్దతు ధర జాబితాలో పసుపును చేర్చాలని, మూతపడ్డ నిజాం చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించాలని, ఎర్రజొన్నలను క్వింటాల్కు రూ.4,500 మద్ద తు ధరకు కొనుగోలు చేయాలని, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని కోరుతూ మహా పాదయాత్ర చేస్తున్నట్టు తెలిపారు. ముత్యంపేట్ నిజాం చక్కెర ఫ్యాక్టరీ నుంచి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రైతు వేదిక నాయకులు శ్రీనివాస్రెడ్డి, మోహన్రెడ్డి, సాయిరెడ్డి, బుచ్చిరెడ్డి, మల్లయ్య, గంగారాం, దేవరాం, లింగారెడ్డి, షేర్ నర్సారెడ్డి, రాజరెడ్డి, సంజీవ్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.