Kaleshwaram | హైదరాబాద్/రాజన్న సిరిసిల్ల, మే 23 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమవుతున్నది. గోదావరి జలాలు మానేటికి ఎదురెక్కనున్న శుభసమయం ఆసన్నమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-3లో భాగంగా చేపట్టిన 9వ ప్యాకేజీ పనులు సంపూర్ణమయ్యాయి. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట వద్ద చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణం పూర్తయ్యింది. దీంతో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్శాఖ అధికారులు నాలుగురోజులపాటు రేయింబవళ్లు శ్రమించి మానేరు రామప్పగుట్ట నుంచి టన్నెల్ ద్వారా మల్కపేట వద్ద గల సర్జిపూల్కు నీటిని తరలించారు. మంగళవారం ఉదయం చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఈఈ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో మిషన్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ట్రయల్న్న్రు విజయవంతంగా నిర్వహించారు.
ఉదయం 7.30 గంటల నుంచి 8.30 వరకు గంటపాటు ట్రయల్న్ కొనసాగింది. ఎంఆర్కేఆర్, డబ్ల్యూపీటీఎల్ కోల్కతా, బీహెచ్ఈఎల్, కిర్లోస్కర్ సంస్థల ప్రతినిధులు ట్రయల్న్ల్రో భాగస్వాములయ్యారు. మొదటి పంపు సిద్ధం కానందున రెండో పుంపు ద్వారా ఉదయం 7.30 గంటలకు నీటిని రిజర్వాయర్లోకి ఎత్తిపోసేందుకు ట్రయల్న్ నిర్వహించారు. దీంతో సర్జిపూల్ నుంచి 130 మీటర్ల ఎత్తున ఉన్న రిజర్వాయర్లోకి రెండో యూనిట్ ద్వారా గోదారమ్మ పరుగులు తీసింది. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభించేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. ఇక శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి గంభీరావుపేట మండల నర్మలా వద్ద ఎగువమానేరు ప్రాజెక్టులోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కనున్నాయి.
దశాబ్దాల కల సాకారం
ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతల పథకం చేపట్టి సాగునీరు అందించాలని రాజన్నసిరిసిల్ల జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు దశాబ్దాలుగా డిమాండ్ చేసినా సమైక్య పాలకులు పట్టించుకోలేదు. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ కరువు పీడిత ప్రాంతాలైన సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని 96,150 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్-3కి రూపకల్పన చేశారు. సిరిసిల్ల రామప్పగుట్టల వరకు ఎదురెక్కి వచ్చిన గోదావరి జలాలను గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు జలాశయంలోకి ఎత్తిపోసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రూ.1,500 కోట్లతో పనులు చేపట్టగా సొరంగమార్గాలు, గ్రావిటీ కెనాల్స్, పంప్హౌజ్లు, 3 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం పూర్తయ్యింది. వీటితోపాటు ఐదు డిస్ట్రిబ్యూటరీలు, ఫీడర్ చానల్ పనులు కూడా పూర్తయ్యాయి. రామప్పగుట్ట నుంచి కోనరావుపేట మండలం మల్కపేట వరకు భూగర్భ కాలువను 12.3 కిలోమీటర్ల పొడవున నిర్మించారు. టన్నెల్కు సుమారు రూ.వెయ్యి కోట్లు ఖర్చు కాగా, మల్కపేటలోని 3 టీఎంసీల రిజర్వాయర్కు సుమారు రూ.500 కోట్ల వరకు ఖర్చు చేశారు. 130 మీటర్ల లోతులోని సర్జిపూల్ నుంచి 1,100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు 30 మెగావాట్ల సామర్థ్యం గల రెండు విద్యుత్తు మోటర్లను బిగించారు. ఒక్కో మోటర్ 550 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయనున్నది.
ఏడు గుట్టలను అనుసంధానం చేస్తూ మల్కపేట రిజర్వాయర్ను నిర్మించారు. ఐదు కిలోమీటర్ల పొడవు గల ఆరు బండ్లను నిర్మించారు. ఒక్కో బండ్ కిలోమీటర్ పొడవు ఉంటుంది. సర్జిపూల్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు 90 మెగావాట్ల విద్యుత్తు అవసరం కాగా, 33/11కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. మల్కపేట రిజర్వాయర్ నిర్మాణం పూర్తయి, ట్రయల్ రన్ కూడా విజయవంతం కావడంతో గోదావరి జలాలతో 150 చెరువులను నింపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సీజన్ నుంచే సాగునీటిని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లింక్-3లో ప్రధానంగా రెండు లిఫ్ట్లకు రూపకల్పన చేయగా పూర్తిగా ఎత్తు మీద ఉన్న పలు ప్రాంతాలకు సైతం సాగునీటిని అందించాలనే లక్ష్యంతో అధికారులు పలు చోట్ల అదనపు లిఫ్ట్లను సైతం ఏర్పాటు చేశారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి మైసమ్మ చెరువుకు జలాలను తరలించే ప్రధాన గ్రావిటీ కెనాల్ మీద 6.1 కిలోమీటర్ల వద్ద కుడివైపున మొదటి అదనపు లిఫ్ట్ను ఏర్పాటు చేశారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి 7.37 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఎడమ ప్రధాన కాలువపై 1.6 కిలోమీటర్ల వద్ద 2వ అదనపు లిఫ్ట్, 6.7 కిలోమీటర్ల వద్ద 3వ అదనపు లిఫ్ట్ను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా వీర్నపల్లిలో 5,800 ఎకరాలకు, కోనరావుపేటలో 4,200 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.
ప్రతికూల భౌగోళిక పరిస్థితుల్లోనూ..
వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టులలో మిగతా లింకులతోపాటే లింక్-3 పనులు కూడా మొదలయ్యాయి. స్థానికంగా నెలకొన్న ప్రతికూల భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో పనులు నిదానంగా కొనసాగాయి. 12 కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మాణం సవాలుగా మారింది. విపరీతమైన నీటి ఊటలు రావడంతో పనులకు నిత్యం అంతరాయం ఏర్పడింది. అధికారులు ఎప్పటికప్పుడు ఊటను తొలగిస్తూ పనులు కొనసాగించారు. సొరంగమార్గం తవ్వడం ఒక ఎత్తయితే లైనింగ్ చేయడం మరో సవాలుగా నిలిచింది. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తుగా అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఒకటికి రెండుసార్లు పరిశీలన చేసుకుంటూ పనులను నిర్వహించారు. ఎట్టకేలకు పనులన్నీ అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు.
సింగసముద్రానికి శాశ్వత అందాలు
ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తరలించడం వల్ల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సింగసముద్రం చెరువు శాశ్వత అందాలను సంతరించుకోనున్నది. గంభీరావుపేట మండ లం సముద్రలింగాపూర్ గ్రామ పరిధిలోని సింగసముద్రం చెరువునకు ప్రత్యేకత ఉన్నది. కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన ఈ చెరువుకు ఎక్కడా లేని విధంగా 5 మత్తళ్లు ఉండటం ప్రత్యేకత. వానకాలంలో అలుగు పోసినప్పుడు ఆ అందాలను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకలు తరలివస్తుంటారు. ప్రస్తుతం గోదావరి జలాలతో నింపనుండటంతో ఇక చెరువు అందాలు శాశ్వతం కానున్నాయి.
జలాల తరలింపు ఇలా..
లక్ష ఎకరాలకు సాగునీరు
మల్కపేట రిజర్వాయర్ ట్రయల్న్ సక్సెస్ కావడంతో మెట్ట ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తమ ఆకాంక్షను నెరవేరుస్తున్నందుకు మంత్రి కేటీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఎకరాలకు నీరందనున్నది. ఇందులో సిరిసిల్ల నియోజకవర్గంలో 64,470 ఎకరాలు, వేములవాడ నియోజకవర్గంలో 31,680 ఎకరాలకుపైగా సాగునీరు అందుతున్నది. సిరిసిల్ల మండలంలో 8,750 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 29,875, గంభీరావుపేటలో 9,279, ముస్తాబాద్లో 9,599, వేములవాడ అర్బన్లో 7,805, వేములవాడ రూరల్లో 1,000, కోనరావుపేటలో 22,875, వీర్నపల్లి మండలంలో 6,967 ఎకరాలకు సాగునీరు అందిస్తారు.