హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ అంశం మీద వెల్లువెత్తుతున్న అభ్యంతరాలపై చర్చించేందుకు బేసిన్లోని అన్ని రాష్ర్టాలతో ఈ నెల 13న సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్ర జల్శక్తిశాఖ తెలిపింది. తెలంగాణతోసహా బేసిన్లోని అన్ని రాష్ర్టాలకు గురువారం లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు పొందిన అనుమతులకు, ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణ పనులకు ఎంతో వ్యత్యాసమున్నదని, ఫలితంగా గతంలో కంటే ఊహించనిరీతిలో ముంపు ఏర్పడుతున్నదని, ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై కచ్చితమైన అధ్యయనం చేయలేదని తెలంగాణతోపాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలు అభ్యంతరాలు తెలుపుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలవరం బ్యాక్వాటర్ ఎఫెక్ట్ సమస్యపై ప్రభావిత రాష్ర్టాలైన తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలతో గత ఆగస్టులో కేంద్ర జల్శక్తిశాఖ తొలి సమావేశాన్ని నిర్వహించింది.