హైదరాబాద్/కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ)/బెజ్జూర్: మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నదిని దాటి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన ఓ ఏనుగు 24 గంటల్లోనే ఇద్దరిని బలి తీసుకున్నది. బుధవారం మధ్యాహ్నం చింతలమానేపల్లి మండలం బూరెపల్లి సమీపంలో మిరపకాయలు ఏరుతున్న అల్లూరి శంకర్ (55)ను తొండంతో కొట్టి చంపింది. గురువారం తెల్లవారుజామున పెంచికల్పేట్ మం డలం కొండపల్లికి చెందిన మరో రైతు కారు పోశన్న(65)ను తొక్కి ప్రాణంతీసింది. గురువారం తెల్లవారుజామున గ్రామ శివారులోని తన పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్తుండగా, ఏనుగు అకస్మాత్తుగా దాడి చేయడంతో పోశ న్న అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పోశన్న కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్థులు, కుటుంబసభ్యులు మృతదేహం వద్ద 3 గంటలపాటు బైఠాయించారు. అదనపు కలెక్టర్ వేణు అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. ఐదు ఎకరాల భూమి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఇప్పటివరకు అడవి నుంచి జనావాసాల్లోకి పులులు ప్రవేశించి మనుషులు, జంతువులపై దాడిచేశాయి కానీ, గజరాజు ఇద్దరి ప్రాణాలు తీయడం ఇదే తొలిసారి. రెండ్రోజుల క్రితం మహారాష్ట్ర గడ్చిరోలి అడవుల్లోకి ఏనుగుల గుంపు ప్రవేశించింది. ఒక ఏనుగు విడిపోయి ప్రాణహిత నది దాటి జిల్లాలోకి ప్రవేశించినట్టు మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు, జిల్లా అధికారులకు సమాచారం అందించారు. ఏనుగును బంధించేందుకు మహారాష్ట్రకు చెందిన నిపుణులను రప్పిస్తున్నారు. ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాల్లో అధికారులు 144 సెక్షన్ విధించారు. గ్రామ శివారు ప్రాంతాల్లోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. గజరాజు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రకటించారు. ఏనుగు దాడిలో రైతులు మరణించిన ఘటనపై అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ అటవీశాఖ అధికారులతో చర్చించారు. ఏనుగును అదుపులోకి తీసుకోవాలని, ప్రజలకు ప్రమాదం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఏనుగు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని పీసీసీఎఫ్ పర్గెయిన్ సూచించారు. గురువారం బెజ్జూర్లోని అటవీశాఖ అతిథిగృహంలో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శాంతారాంతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అడవుల్లోకి తొలిసారిగా ఏనుగు రావడంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నదని చెప్పారు. ఏనుగుకు కావాల్సిన ఆహారం లేదని, అది ఎక్కువ కాలం ఈ ప్రాంతంలో ఉండదని చెప్పారు. రాత్రిళ్లు కూడా థర్మల్ డ్రోన్లతో ఏనుగు జాడ తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
అటవీ అధికారుల స్వీయ రక్షణకు ఆయుధాలు, మందుగుండు, ఇతర రక్షణ సామగ్రి అవసరాన్ని తాజా ఘటన మరోసారి గుర్తుచేసింది. అడవుల సమర్థ పర్యవేక్షణకు ఫారెస్ట్స్టేషన్లను స్థాపించాలని అటవీశాఖ విజ్ఞప్తి చేసింది. ఇందుకు రూ.9.90 కోట్లు అవసరమని సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కోసం రూ.4 కోట్లు, 20 ఫారెస్ట్స్టేషన్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం రూ.5.9 కోట్లు, రాష్ట్రంలోని 64 అటవీ చెక్ పోస్టులను బలోపేతం చేయాలని ప్రతిపాదించారు. ఆయుధాల కొరత, సదుపాయాల లేమి కారణంగా ఇలాంటి జంతువుల దాడులు జరిగినప్పుడు తమ శాఖ లోపాలను బయటపెట్టుకోవాల్సి వస్తుందని అటవీశాఖ అధికారులు వాపోతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని రాష్ట్ర అటవీ సేవా అధికారుల సంఘం(ఎస్ఎఫ్ఎస్ఓఏ) గతంలోనే కోరింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్(ఎఫ్ఆర్వో) ర్యాంక్, అంతకంటే ఎకువ ర్యాంక్లకు పిస్టల్స్, స్వీయ రక్షణ కోసం ఫీల్డ్-సిబ్బందికి రైఫిల్స్ అందించాలని డియాండ్ చేశారు.