ముస్తాబాద్, మార్చి 8: ట్రాన్స్ఫార్మర్కు ఫ్యూజ్ వైర్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్లో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిగురు యాదగిరి (55) వరి పంట వేశాడు. నీళ్లు పెట్టేందుకు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు పొలం వద్దకు వెళ్లాడు. బోర్ ఆన్ చేయగా నీళ్లు రాలేదు. అయితే ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ వైర్ పోయినట్టు గుర్తించాడు. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ హ్యాండిల్తో ఏ-బీ స్విచ్ ఆఫ్ చేశాడు. అయితే విద్యుత్తు సరఫరా చేసే మూడు పత్తుల్లో రెండు లైన్ నుంచి విడిపోగా, ఒకటి అలాగే ఉండిపోయింది. యాదగిరి దీన్ని గమనించకుండానే మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా షాక్ కొట్టడంతో కిందపడిపోయాడు. సమీపంలోని రైతులు గమనించి ముస్తాబాద్లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి సిరిసిల్లకు తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందాడు. యాదగిరికి భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు.