బంజారాహిల్స్, నవంబర్ 19: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకపాత్ర పోషించిన కోరే నందకుమార్పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో మరో కేసు నమోదైంది. తనను బ్లాక్మెయిల్ చేస్తూ భారీగా డబ్బులు గుంజుతున్నాడని బంజారాహిల్స్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సిందేర్కర్ సతీశ్ ఇచ్చిన ఫిర్యాదుతో అతనిపై క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిందేర్కర్ సతీశ్కు 2017లో నందకుమార్కు పరిచయం అయ్యాడు.
వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలోని దోమ మండలం బోంపల్లిలో 12 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి ఉన్నదని నందకుమార్ చెప్పడంతో దాన్ని కొనుగోలు చేశాడు. అయితే, ఆ భూమికి ధర భారీగా పెరగడంతో దానిలో తనకు కూడా భాగం ఉన్నదంటూ నందకుమార్ కొత్త వాదనకు దిగాడు. ఈ భూమిపై వివాదం సృష్టిస్టానని బెదిరింపులకు దిగుతూ రూ.21 లక్షలు వసూలు చేశాడు. మరికొన్ని నెలల్లో తాను కోరినంత డబ్బు ఇవ్వాలని, లేకుంటే భూమిని తనపేరు మీదకు మార్చాలని సతీశ్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఇటీవల మరోసారి సతీశ్ను కలిసిన నందు తాను త్వరలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కాబోతున్నానని, బొంపల్లిలోని 12 ఎకరాల స్థలం తనకు కావాల్సిందేనంటూ బెదిరింపులకు దిగాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు శనివారం బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
బీఎల్ సంతోష్పై తెలంగాణ పోలీసులు చేసిన ఆరోపణలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని తేలి.. ఆయన్ను కోర్టులో విచారించాల్సి వస్తే.. అప్పుడు ఆయనపై నిర్ణయం తీసుకోవాల్సింది ఆర్ఎస్ఎస్సే. రామ్మాధవ్లాగా సంతోష్ తదితరులు ఆర్ఎస్ఎస్.. బీజేపీకి అరువిచ్చినవారు. అందువల్ల మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్.. ఆయనపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
సుబ్రమణ్యస్వామి, బీజేపీ ఎంపీ (శనివారం ట్వీట్లో)