కొడిమ్యాల, ఫిబ్రవరి 12: రాష్ట్రంలో ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆటో డ్రైవర్ల ఉసురుతీస్తున్నది. కిస్తీలు కట్టకపోవడంతో ఫైనాన్స్ నిర్వాహకులు ఆటోను తీసుకెళ్లడంతో మనస్తాపం చెందిన ఓ డ్రైవర్ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండలో మూడు రోజుల క్రితం జరిగిన ఈ విషాద ఘటన సోమవారం వెలుగుచూసింది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన బత్తిని మదన్ (37) స్థానికంగా ఆటో నడుపుతుండగా, భార్య కూలి పనులకు వెళ్లేది. రెండేండ్ల కిందట బతుకు దెరువు కోసం అత్తగారి ఊరైన జగిత్యాల జిల్లా నమిలికొండకు వెళ్లాడు. అక్కడే అద్దె ఇంట్లో ఉండేవాడు.
కరీంనగర్లోని ఓ ఫైనాన్స్ నుంచి అప్పు తీసుకొని ఆటో కొనుగోలు చేశాడు. ఆటో కూడా బాగా నడవడంతో అప్పులు తీర్చేశాడు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల కిందట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో కష్టాలు మొదలయ్యాయి. గిరాకీ లేకపోవడంతో కుటుంబ పోషణ కోసం మళ్లీ ఫైనాన్స్లో అప్పు తెచ్చాడు. ఆర్థిక ఇబ్బందులతో రెండు నెలల కిస్తీ కట్టలేదు. గత శుక్రవారం ఫైనాన్స్ వారు ఇంటికి వచ్చి ఆటో తీసుకెళ్లారు. దీంతో మనస్తాపం చెందిన మదన్ అదేరోజు ఉరేసుకున్నాడు.
భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లడంతో ఈ ఘటన బయటకు రాలేదు. సోమవారం ఇంట్లో నుంచి దు ర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వా ళ్లు తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లగా దులానికి విగత జీవిగా వేలాడుతూ కనిపించాడు. వారు అతని భార్యకు సమాచారం అందించగా అక్కడి చేరుకొని భోరున విలపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.