హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): నకిలీ ఎయిర్వే బిల్లులను సృష్టించి విదేశాలకు రూ.1,146 కోట్లు మళ్లించిన కేసులో ఈడీ అధికారులు కీలక నిందితుడు సీబే ఇంటర్నేషనల్ కంపెనీ భాగస్వామి దీపక్ నయ్యర్ను సోమవారం అరెస్టు చేశారు. సీసీటీవీ క్లౌడ్ స్టోరేజీ రెంటల్ సర్వీస్ పేరిట నిందితులు పలు షెల్ కంపెనీలను సృష్టించి విదేశాల నుంచి టెక్నాలజీ, ఇతర పరికరాలు కొనుగోలు చేసినట్టుగా నకిలీ ఎయిర్వే బిల్లులు సృష్టించారు. వీటికి బిల్లులు చెల్లించినట్టుగా హాంగ్కాంగ్, చైనాల్లోని పలు షెల్ కంపెనీలకు పెద్ద మొత్తంలో డబ్బులు తరలించారు. మనీలాండరింగ్ అక్రమాలను గుర్తించిన ఈడీ అధికారులు ఫిర్యాదుచేయడంతో గత సెప్టెంబర్లో హైదరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కేసు దర్యాప్తులో భాగంగా హెచ్ఏఆర్ అసోసియేట్స్ కంపెనీకి చెందిన రవికుమార్, చార్టెడ్ అకౌంటెంట్ను అరెస్టు చేశారు. ఇదే కేసులో ఈడీ అధికారులు తాజాగా దీపక్ నయ్యర్ను అరెస్టు చేశారు. నిందితుడిని అధికారులు హైదరాబాద్ పీఎంఎల్ఏ స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. అతడికి కోర్టు ఈ నెల 20 వరకు కస్టడీ విధించింది.