హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): మరో 8 నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా ఈ ఏడాది రాష్ట్రంలో మరో 8 కాలేజీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,000 కోట్లు కూడా కేటాయించింది. జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తారు. 2023-24 విద్యాసంవత్సరానికి అందుబాటులోకి వచ్చేలా 100 ఎంబీబీఎస్ అడ్మిషన్లకు తగిన వసతులు కల్పిస్తారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం 100 ఎంబీబీఎస్ అడ్మిషన్లకు కనీసం 430 పడకలు అందుబాటులో ఉండాలి.
దానికోసం ప్రస్తుతం ఉన్న దవాఖానల అప్గ్రేడేషన్, నూతన భవనాల నిర్మాణాన్ని చేపడుతారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న దవాఖానల వివరాలు, అదనంగా ఏర్పాటు చేయాల్సిన పడకల సంఖ్యను వైద్య విద్య విభాగం సేకరించింది. వీటిని టీఎస్ఎంఎస్ఐడీసీకి పంపి, వసతుల కల్పనకు బడ్జెట్ అంచనాలు రూపొందించాలని సూచించింది. కాలేజీ భవనాలు, హాస్టల్ భవనాలు, పరికరాలు వంటివాటికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేయాలని కోరింది. 8 జిల్లాల్లో కలిపి అప్గ్రేడేషన్కు అదనంగా 935 పడకలు అవసరం అవుతాయని లెక్కించారు.