హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. వరుస నోటిఫికేషన్లతో పండుగ వాతావరణం నెలకొన్నది. గతంలోనే గ్రూప్-1 పోలీస్, ఇంజినీర్ తదితర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. గురువారం గ్రూప్-4 ఉద్యోగాలకు సైతం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇలా ఒకవైపు నోటిఫికేషన్లు ఇస్తూనే.. మరోవైపు కొత్త మార్పులు చేస్తున్నది. గతంలో 663 గ్రూప్-2 ఉద్యోగాలకు అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ.. ఇటీవల వాటికి కొత్తగా మరో 6 రకాల పోస్టులను కలుపుతూ ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖలకు చెందిన ఏఎస్వో, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను కొత్తగా జత చేయడంతో గ్రూప్-2 క్యాటగిరీలో మరో 66 ఉద్యోగాలు రానున్నాయి. ఫలితంగా ఈ క్యాటగిరీలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 729కి పెరగనున్నది. గ్రూప్-2లో ప్రభుత్వం కొత్తగా చేర్చిన పోస్టులన్నీ తాసిల్దార్ కంటే ఎక్కువ హోదా కలిగినవే. దీనిపై రాష్ట్రంలోని నిరుద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మే నెలలో పరీక్ష
ఉద్యోగ నియామకాల ప్రక్రియను టీఎస్పీఎస్సీ శరవేగంగా చేపడుతున్నది. గ్రూప్-2లోని ఖాళీలు, ఇండెంట్లు, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు తదితర అంశాలపై ఇప్పటికే కసరత్తు చేస్తున్నది. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో సర్వీసు రూల్స్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నది. సాధారణంగా ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే.. ఆ రోజు నుంచి పరీక్షకు 3 నెలల గడువు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో గ్రూప్-2 ఉద్యోగాలకు డిసెంబర్లోనే నోటిఫికేషన్ ఇచ్చి, మే నెలలో పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ కసర్తతు చేస్తున్నట్టు సమాచారం.