హైదరాబాద్ : బ్రాహ్మిణ్ ఎంటర్ప్రెన్యూవర్షిప్ స్కీం ఆఫ్ తెలంగాణ (బెస్ట్) పథకం కింద మరో 500మందిని ఎంపికచేశారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2011 మందికి లబ్ధి చేకూరింది. వచ్చే ఏడాదిలో కొత్త దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బ్రాహ్మణులకు ఆర్థికంగా సహాయం అందించేందుకు ‘బెస్ట్’ స్కీమ్ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సొంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు గరిష్ఠంగా రూ.5లక్షల వరకు గ్రాంట్ అందించనున్నారు. 2017 నుంచి అమలవుతున్న ఈ పథకంలో భాగంగా ఈ ఏడాది జనవరి వరకు 2011 మందికి రూ. 56,45,26,727కోట్లు గ్రాంటుగా అందించారు.
గత ఏడాది వచ్చిన దరఖాస్తులే 1200లకుపైగా పెండింగ్లో ఉండడంతో ఈ ఏడాది కొత్త దరఖాస్తులు తీసుకోలేదు. పెండింగ్ దరఖాస్తుల్లో ఈ ఏడాది 500 దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయి తనిఖీలు పూర్తిచేశారు. త్వరలోనే వీరికి ఆర్థిక సహాయం అందిస్తారు. ఆ తర్వాత పెండింగ్లో ఉన్న మరో 700 దరఖాస్తులు పరిశీలించి, క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. మొత్తం పెండింగ్ దరఖాస్తులన్నీ పూర్తయ్యాక కొత్త దరఖాస్తులను ఆహ్వానిస్తామని సంక్షేమ పరిషత్ ప్రత్యేక అధికారి చంద్రమోహన్ తెలిపారు. అన్నీ సవ్యంగా సాగితే పెండింగ్ దరఖాస్తులన్నీ పూర్తయ్యేందుకు మరో ఆరు నెలల సమయం పడుతుందని ఆయన చెప్పారు.
‘బెస్ట్’ పథకం కింద ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం అధికారులు పరిశీలించి, అర్హతగల దరఖాస్తుదారులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతారు. బీపీఎల్ పరిధిలోకి వస్తారని తేలితే ఆర్థిక సాయానికి ఎంపిక చేశారు.
ఈ ప్రక్రియంతా నిర్వహించేందుకు ప్రత్యేక అధికారి సహా ఇద్దరు పర్మినెంట్ ఉద్యోగులు, మరో ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రమే సంక్షేమ పరిషత్లో పనిచేస్తున్నారు. వందల సంఖ్యలో ఉన్న దరఖాస్తుదారుల క్షేత్రస్థాయి పరిశీలన కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్నది. దీంతో దరఖాస్తుల పరిష్కారంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటున్నదని అధికారులు తెలిపారు.