హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన సోమవారం అమ్మవారు స్వర్ణరథంపై భక్తులకు కనువిందు చేశారు. స్వర్ణరథంపై అమ్మవారిని దర్శించుకొన్నవారికి తలచిన పనులు నెరవేరడంతోపాటు, మరో జన్మ ఉండదని అర్చకులు తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కోలిపి సహస్రనామార్చన నిర్వహించారు.
అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా స్వర్ణరథం మంటపానికి తీసుకొచ్చారు. ఉదయం 7 నుంచి 8.30 గంటల వరకు స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. ఆ రథాన్ని అధిరోహించిన అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజసం నిర్వహించారు. పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకించారు. రాత్రి 7.30 నుంచి 8.30 వరకు అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాధం, ఏఈవో ప్రభాకర్రెడ్డి, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, దేవాలయ ఇన్స్పెక్టర్ దామోదరం తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో స్వరూపానంద ప్రత్యేక పూజలు
విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, జూనియర్ పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతితో కలిసి సోమవారం తిరుమలలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మొదట వరాహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ డీఈవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
వసంతోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వసంతోత్సవాలు మే 19 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను సోమవారం ఆలయంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గురుమూర్తి, సూపరింటెండెంట్ రమణయ్య విడుదల చేశారు.