ముషీరాబాద్, జూలై 4: మాదిగల ఆత్మగౌరవాన్ని చాటిన దండోరా ఉద్య మం మొదలై 28 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7 నుంచి ఆగస్టు 6 వరకు దండోరా పండుగ పేరిట వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ తెలిపారు. ఎన్నో ఉద్యమాలకు ప్రేరణగా నిలిచిన దండోరా ఉద్యమ చరిత్రను చాటి చెప్పేలా మాదిగవాడల్లో జెండా పండుగ నిర్వహిస్తామని చెప్పారు. మంగళవారం ఆయ న విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అణచివేతను ప్రశ్నిస్తూ హక్కుల సాధన కోసం పుట్టిన దండోరా ఉద్యమంతో మాదిగల ఆత్మగౌరవం పెరిగిందని, సబ్బండ కుల ఉద్యమాలకు మార్గదర్శకంగా నిలిచిందని పేర్కొన్నారు. తమ పోరాటాల మూలంగానే మాదిగలు, ఉప కులాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు.