శ్రీశైలం : శ్రీశైలం శ్రీభ్రమరాంబ అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు అర్చక పండితులచే పంచామృతాభిషేకాలు పుష్పార్చనలు సర్కారీ సేవగా జరిపించినట్లు ఆయన చెప్పారు. సాయంత్రం అమ్మవారి ప్రాకార మండపంలో గులాబీ, నందివర్థనం, చామంతి, బంతి వంటి పూలతో ప్రత్యేకంగా అలంకరించిన ఊయలలో స్వామిఅమ్మవార్లను వేంచేబు చేసి అష్టోత్తరశతనామావళి పూజలు చేశారు.
వారాంతపు రోజులు కావడంతో భక్తులు శ్రీశైలం క్షేత్రానికి వచ్చి శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను చేసి ఉంచినట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామిఅమ్మవార్ల ఆర్జితసేవా టిక్కెట్లతోపాటు, విరామ దర్శనాల టిక్కెట్లను కూడా ముందుగా ఆన్లైన్ www.srisailadevasthanam.org లో నమోదు చేసుకుని రావాలని ఈవో లవన్న కోరారు. అదే విధంగా గర్బాలయ అభిషేక లడ్డూ ప్రసాదం సామాన్య భక్తులకు కూడా అందుబాటులో ఉండేలా ప్రత్యేక అభిషేక లడ్డూ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించి ఈవో స్వయంగా భక్తులకు విక్రయించారు.
ప్రాచీన కళలను పరిరక్షించే ధర్మపథం కార్యక్రమంలో భాగంగా ఆలయ దక్షిణ మాఢవీధిలో జరుగుతున్న నిత్యకళారాధన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయని పీఆర్వో శ్రీనివాసరావు చెప్పారు. శనివారం సాయంత్రం హైదరాబాద్కు చెందిన కళాకారులు,చిన్నారులు సంప్రదాయ నృత్యాలతో స్వామిఅమ్మవార్లకు నృత్య నివేదన చేయనున్నారు.