హైదరాబాద్ : కులవృత్తులకు చేయూతను అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గొర్రెల పంపిణీ, సంపద అభివృద్థిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అన్ని జిల్లాల పశువైద్యాధికారులు, పశు సంవర్ధకశాఖ అధికారులతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, 2వ విడత గొర్రెల పంపిణీపై తదితర అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ రాంచందర్, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, టీఎస్ఎల్డీఏ సీఈఓ మంజువాణి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రంలో పశుసంవర్థకశాఖకు సీఎం కేసీఆర్ అందిస్తున్న సహకారంతో ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ప్రభుత్వం రూ. 5 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన మొదటి విడత గొర్రెల పంపిణీ అద్భుత ఫలితం ఇచ్చిందన్నారు. 2వ విడత పంపిణీ కోసం సర్కారు రూ.6 వేల కోట్లు విడుదల చేసిందని, ఈ నెల 28న హుజూరాబాద్లో పంపిణీ లాంఛనంగా ప్రారంభమైందని గుర్తుచేశారు.
పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని గొర్రెల యూనిట్ ధరను రూ.1.25 లక్షల నుంచి 1.75 లక్షలకు సీఎం పెంచారని చెప్పారు. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా పశువైద్యాధికారులకు సూచించారు. పంపిణీ చేసే గొర్రెలకు కొనుగోలు చేసిన ప్రాంతంలోనే బీమా పత్రాలను అందజేసేలా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గొర్రెలు చనిపోతే సకాలంలో బాధితులకు బీమా అందించేలా చూడాలని ఆదేశించారు.
పెరిగిన జీవాలకు అనుగుణంగా గ్రాసం కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. రైతులకు సబ్సిడీ పై గడ్డి విత్తనాలను సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. జీవాల వద్దకే వైద్యసేవలు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రారంభించిన సంచార పశువైద్య శాలల పనితీరు పట్ల నిరంతరం పర్యవేక్షణ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మొదటి విడతలో 79.16 లక్షల గొర్రెలను పంపిణీ చేయగా, వాటికి కోటి 30 లక్షల పిల్లలు పుట్టినట్లు తెలిపారు. వీటి విలువ రూ.7,800 కోట్లు ఉంటుందని వివరించారు. అంతేకాకుండా 93వేల టన్నుల మాంసం ఉత్పత్తి జరిగిందని పేర్కొన్నారు.
గొర్రెల పెంపకందారులు గొర్రెలను అమ్ముకునేందుకు, కొనుగోలు చేసేందుకు అన్నిరకాల సౌకర్యాలు, వసతులతో కూడిన మార్కెట్ల నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఖమ్మం, పెద్దపల్లి, వనపర్తి తదితర జిల్లాలలో గొర్రెల మార్కెట్ల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రతి జిల్లా కేంద్రంలో గొర్రెల మార్కెట్ నిర్మాణానికి అవసరమైన 5 ఎకరాల భూమిని ఆయా జిల్లా కలెక్టర్ల సహకారంతో గుర్తించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పశు వైద్యశాలలను దశల వారీగా అభివృద్ధి చేస్తున్నామని, మొదటి విడతలో సుమారు 480కి పైగా దవాఖానల్లో మౌలిక సౌకర్యాలు, వసతులను కల్పించనున్నట్లు వివరించారు. జీవాలకు వైద్య సేవలు అందించే విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తుందని అన్నారు.
ప్రభుత్వం కొనుగోలు చేసి జిల్లాల్లోని పశువైద్య శాలలకు సరఫరా చేస్తున్న మందులను మాత్రమే కాకుండా రైతుల కావాల్సిన మందులు ఏమైనా ఉంటే సమగ్ర సమాచారం సేకరించి వాటి కొనుగోలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జీవాలకు వైద్య సేవలు, గొర్రెల పంపిణీ పంపిణీ వంటి ప్రభుత్వ కార్యక్రమాల అమలులో గోపాలమిత్రల సేవలను వినియోగించుకోవాలని మంత్రి చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS) క్రింద గొర్రెలు, పశువుల షెడ్ ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఆగస్టు 6 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని గజ్వేల్లో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా ప్రకటించారు.