Congress | హైదరాబాద్, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ): ఒకే కుటుంబానికి రెండు టికెట్ల పంచాయితీ ఇప్పుడు కాంగ్రెస్లో అగ్గిరాజేస్తున్నది. మొన్నటి వరకు ఉదయ్పూర్ డిక్లరేషన్ను సాకుగా చూపుతూ ‘ఒకే కుటుంబం-ఒకే టికెట్’ అంటూ సుద్దులు చెప్పిన అధిష్ఠానం ఇప్పుడు యూటర్న్ తీసుకున్నది. ఇప్పటికే పలువురు నేతల కుటుంబాలకు రెండేసి టికెట్లపై హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారానికి మైనంపల్లి హన్మంతరావు ఆజ్యం పోసినట్టు చెబుతున్నారు.
ఆయనకు, కుమారుడు రోహిత్కు టికెట్లు ఇస్తామన్న హామీతోనే కాంగ్రెస్ ఆయనను పార్టీలో చేర్చుకున్నది. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న నేతలు ఇప్పుడు అధిష్ఠానంపై ఎదురుదాడి మొదలుపెట్టారు. కొత్తగా వచ్చిన వ్యక్తికే రెండేసి టికెట్లు ఇస్తే, పార్టీనే నమ్ముకుని ఎప్పటి నుంచో ఉన్న తమ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. తప్పక తలొగ్గిన కాంగ్రెస్ పెద్దలు మరికొందరు నేతలకు కూడా రెండు టికెట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తున్నది.
రెండేసి టికెట్లు వీరికే
ఉత్తమ్ కుమార్రెడ్డి, ఆయన భార్య పద్మావతికి హుజూర్నగర్, కోదాడ టికెట్లు, జానారెడ్డికి నాగార్జునసాగర్, ఆయన పెద్ద కుమారుడు రఘువీర్రెడ్డికి మిర్యాలగూడ, కొండా సురేఖకు వరంగల్ తూర్పు, ఆమె భర్త కొండా మురళికి పరకాల టికెట్లపై హామీ ఇచ్చినట్టు సమాచారం. మైనంపల్లితో కలుపుకొని మొత్తం నాలుగు కుటుంబాలకు రెండేసి టికెట్ల హామీ ఇచ్చినట్టు తెలియడంతో తమను కూడా ఆ జాబితాలో చేర్చాలని మరికొందరు నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. వీరిలో మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్ ఉన్నట్టు తెలిసింది. రెండు టికెట్ల డిమాండ్తో కాంగ్రెస్లో మరోమారు వేడి రాజుకుంది.