హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ టీచర్లు, ఆయాలను కొవిడ్ ఫ్రంట్లైన్ వారియర్స్ జాబితాలో చేర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ను కేంద్రం అంగీకరించింది. మన రాష్ర్టానికే కాకుండా అన్ని రాష్ర్టాల్లోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలను కేంద్ర ప్రభుత్వం కొవిడ్ యోధులుగా గుర్తించింది. వారికి రూ.50 లక్షల రూపాయల బీమా సదుపాయాన్ని వర్తింపజేసింది. ఇంతకుముందు కొవిడ్ను ఎదుర్కోవటానికి వివిధ రంగాల్లో సేవలు అందించినవారిని ఫ్రంట్లైన్ వారియర్లుగా ప్రకటించి వారికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన్మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ కింద రూ.50 లక్షల బీమా నుంచి అంగన్వాడీలను మినహాయించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకూ ఈ బీమా సౌకర్యం కల్పించాలని జూన్ 23, 2021న రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కేంద్రానికి లేఖ రాశారు. కేవలం లేఖ రాయడంతోపాటు సెప్టెంబర్ 3న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఎంపీ మాలోతు కవిత, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి అంగన్వాడీలను ఇందులో చేర్చాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక రంగాల్లో ఆదర్శంగా ఉన్నట్టే అంగన్వాడీలను ఆదుకోవటంలోనూ ముందున్నదని మం త్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. సీఎం ఆదేశాలతో ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు కేంద్రం అంగీకరించిందని ఆమె చెప్పా రు. అంగన్వాడీలను ఆదుకోవటంలో ముందు ఉండాలన్న కేసీఆర్ దిశానిర్దేశం వల్ల తమ ప్రయత్నాలు ఫలించాయని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.