హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): కేసీ కెనాల్కు తుంగభద్ర నీటిని కాకుండా శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా తరలిస్తుండటంపై తెలంగాణ సర్కారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కడప-కర్నూలు కెనాల్కు తుంగభద్ర నీటిని మాత్రమే వాడుకోవాలి. అది కూడా అవార్డులో నిర్దేశించిన పరిమితులకు లోబడి మాత్రమే అయినప్పటికీ దాన్ని ఏపీ అతిక్రమించడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు తుంగభద్ర బోర్డుకు తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ శనివారం ఒక లేఖ రాశారు. ట్రిబ్యునల్ అవార్డును అతిక్రమించి తుంగభద్ర బోర్డు చేసిన రెండు నిర్ణయాలు ఆమోదయోగ్యం కావని తేల్చిచెప్పారు. కేసీ కెనాల్కు సుంకేసుల బరాజ్ నుంచి తుంగభద్ర నీటిని మాత్రమే వాడుకోవాలని గుర్తుచేసింది.
దీనికి బదులు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అనుమతుల్లేని మల్యాల, ముచ్చుమర్రి వద్ద హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల ద్వారా, ముచ్చుమర్రి వద్ద కేసీ కెనాల్ లిఫ్ట్ సీం ద్వారా, పోతిరెడ్డిపాడు దిగువన బనకచెర్ల వద్ద ఎసేప్ రెగ్యులేటర్ ద్వారా మొత్తం నాలుగు అదనపు మార్గాల ద్వారా కృష్ణా జలాలను కేసీ కెనాల్కు మళ్లిస్తున్నదని ఆక్షేపించింది. ఏపీ అక్రమ మళ్లింపులను తుంగభద్ర బోర్డు అంగీకరిస్తూ నిర్ణయించడంపై తెలంగాణ వ్యతిరేకించింది. తుంగభద్ర డ్యామ్ నుంచి నీటి ప్రాజెక్టులకు ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల నిష్పత్తిలోనే ఆయా డ్యామ్ల నిర్వహణకయ్యే ఖర్చును రాష్ట్రాలు భరించాల్సి ఉన్నదని తెలిపింది. రాజోలిబండ (ఆర్టీఎస్) మళ్లింపు పథకం నిర్వహణ ఖర్చును కూడా కేటాయింపుల ఆధారంగా చేయాలని స్పష్టం చేసింది. వెంటనే తుంగభద్ర బోర్డు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని ఈఎన్సీ ఆ లేఖలో డిమాండ్ చేశారు.