హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి కొత్త బార్ పాలసీని విడుదల చేసింది. మూడేండ్ల కాలపరిమితితో కొత్త లైసెన్స్లు జారీచేయనున్నట్టు ప్రకటించింది. కొత్త పాలసీలో లైసెన్స్ ఫీజుతోపాటు నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ చార్జీలను ఏడాదికి 10 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకొన్నది. మద్య నియంత్రణ విధానంలో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 840 బార్లకు మాత్రమే లైసెన్సులను పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న బార్లు ఒకేచోట కేంద్రీకృతం కాకుండా కొత్త పట్టణాలకు విస్తరించేలా లైసెన్స్లను హేతుబద్ధీకరిస్తామని పేర్కొన్నది. పట్టణ ప్రాంతాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ఎన్ని బార్లు ఉండాలో ఆబ్కారీ శాఖ కమిషనర్ నిర్ణయిస్తారని తెలిపింది. లైసెన్స్ పొందిన వ్యక్తి మున్సిపల్ కార్పొరేషన్లో 10 కిలోమీటర్లు, మున్సిపాలిటీలో 3 కి.మీ. పరిధిలో ఎక్కడైనా బార్ను పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది.
లైసెన్స్ల గడువు పొడిగింపు
ఏపీలో బార్ లైసెన్సులను మరో రెండు నెలలు పొడిగిస్తూ ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెలాఖరుతో లైసెన్సుల గడువు ముగుస్తుండటంతో వాటి కాలపరిమితిని ఆగస్టు 31 వరకూ పొడిగించారు. ఈ రెండు నెలల కాలానికి ప్రత్యేకంగా నిర్దేశించిన ఫీజులను ఈ నెల 27న చెల్లించాలని, సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.