హైదరాబాద్ ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ‘అక్రెడిటేషన్ కమిటీలో ఆంధ్రా జర్నలిస్టులను నియమించడంలోని ప్రభుత్వ అంతర్యమేంటి?తెలంగాణలో సమర్థులైన పాత్రికేయులు లేరా?’ అని అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో అక్రెడిటేషన్ల జారీ విషయంలో నిర్దిష్టమైన పాలసీని తీసుకున్నామని శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. ఎవరైతే వరుసగా పదిహేనేండ్లు జర్నలిస్టుగా పనిచేస్తున్న వారిని ఫ్రీలాన్స్ కోటా అక్రెడిటేషన్కు అర్హులుగా నిర్ణయించామని, వారు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేకుండా చేశామని, ఎవరైతే పదేండ్లు ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన జర్నలిస్టు, ఏదైనా యూట్యూబ్, వెబ్సైట్లో పనిచేసినా అక్రెడిటేషన్ పొందేలా నిబంధనల్లో పొందుపరిచామని గుర్తుచేశారు.
ఇప్పుడు ప్రధాన పత్రికలు, చానళ్లకు కార్డులను కుదించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అక్రెడిటేషన్ల జారీ లో కొత్తదనం చూపెట్టాలనే యావలో ప్రభుత్వం అనేక తప్పిదాలు చేస్తున్నదని విమర్శించారు. అక్రమార్కులను కట్టడి చేయాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని గైడ్ చేయాల్సిన బా ధ్యత మీడియా అకాడమీపై ఉన్నదని, కానీ ఈ వ్యవహారాన్ని మీడియా అకాడమీ అధికారులపై నెట్టి సీఎంవో, సీపీఆర్వో తప్పించుకుంటున్నాయని ఆరోపించారు. అక్రెడిటేషన్ల జారీ విషయంలో గత ప్రభుత్వం జారీ చేసిన జీవోను యథావిధిగా అమలుచేయాలని, లేదంటే గతంలో ఇచ్చిన కార్డులన్నింటినీ రెన్యూవల్ చేయాలని డిమాండ్చేశారు.