హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ జీవోలపై ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాలు బుధవారం కూడా కొనసాగాయి. ఈ జీవోలను బేషరతుగా రద్దు చేయాలని, లేకపోతే సమ్మెకు సైతం సిద్ధమని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. బుధవారం విజయవాడలోని ఎన్జీవో కార్యాలయం వద్ద పీఆర్సీ జీవోలను దగ్ధం చేశాయి. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమను మోసగించిందని, కొత్త పీఆర్సీతో ప్రతి ఉద్యోగి జేబుకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు చిల్లుపడేలా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీపై సమ్మెకు దిగాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయని, 21న సీఎస్కు సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు. ఇకపై ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు ఉండవని ప్రకటించారు. ప్రభుత్వం ఏకపక్షంగా ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు.
పీఆర్సీతో ఉద్యోగుల జీతాలేమీ తగ్గవని ఏపీ సీఎస్ సమీర్శర్మ చెప్పారు. రాష్ట్ర రెవెన్యూ గణనీయంగా తగ్గినందున ఉద్యోగుల వేతనాలను, సంక్షేమ పథకాలను సమన్వయం చేసుకొంటూ ముందుకు సాగడమే ప్రభుత్వ కర్తవ్యమని స్పష్టం చేశారు. ఉద్యోగులతో చర్చలు కొనసాగిస్తామని, త్వరలోనే అన్నీ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేయడం తగదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఏపీ ప్రభుత్వానికి హితవు పలికారు. తిరుపతిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ సర్కారు ఉద్యోగ సంఘాలను సంతృప్తి పరచలేకపోయిందని విమర్శించారు.