హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డి ఏపీలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. గురువారం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకొన్నారు. తెలుగు రాష్ర్టాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నందుకుగాను ఏపీ ప్రభుత్వం ఈ గౌరవాన్ని అందించింది.
ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి వైద్యవృత్తిలో నిబద్ధతకు నిదర్శనమని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. వరల్డ్ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో పాటు ఏపీలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకొన్న నాగేశ్వర్రెడ్డిని గురువారం గవర్నర్ రాజ్భవన్లో సత్కరించిన జ్ఞాపిక అందించారు. వైద్యవృత్తిలో నాగేశ్వర్రెడ్డి సాధించిన ఘనతను చూసి తెలుగు రాష్ర్టాల ప్రజలు గర్విస్తున్నారని బిశ్వభూషణ్ పేర్కొన్నారు.