నంగునూరు, డిసెంబర్ 17 : సర్కారు బడి విద్యార్థుల కోసం ఓ అవ్వ తన ఆసరా పింఛన్ రూ.2016ను విరాళమిచ్చి గొప్ప మనసు చాటుకొన్నారు. కరోనా తర్వాత తెరుచుకొన్న సర్కారు బడిలో సౌకర్యాల కల్పనకు ఉపాధ్యాయుల పిలుపు మేరకు తన నెల పింఛన్ అందజేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రానికి చెందిన సుద్దాల ఆండాలమ్మది నిరుపేద కుటుంబం. ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు. అందరికీ పెండ్లిళ్లు అవ్వగా అందరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఆమె ఒక్కరే ఉంటున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పింఛన్ డబ్బులతో ఆమె బతుకు వెళ్లదీస్తున్నారు. అయితే, కరోనా కారణంగా ప్రైవేటు పాఠశాలలు మూతపడి సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు, బోధన పరికరాల కోసం దాతలు ముందుకురావాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆండాలమ్మ తనకు వచ్చిన ఆసరా పింఛన్ రూ.2016 మొత్తాన్ని శుక్రవారం పాఠశాల ఉపాధ్యాయులకు అందజేశారు. పిల్లల భవిష్యత్తు కోసమే తన పింఛన్ డబ్బులను అందజేశానని ఆండాలమ్మ పేర్కొన్నారు.
తల్లిదండ్రుల మీటింగులో ఎవరికి తోచిన విధంగా వారు సహాయం చేయాలని సార్లు అడిగిండ్రు. ఒకరిముఖాలు ఒకరు చూసుకొన్నారే కానీ ఎవరూ ముందుకు రాలె. కరోనా వచ్చి పిల్లల సదువంతా కరాబైపోయింది. వాళ్ల భవిష్యత్తు కోసం నా నెల పింఛన్ ఇయ్యాలి అనిపించింది. వెంటనే పింఛన్ తీసుకపోయి సార్లకు అప్పజెప్పిన. మన పిల్లలు బాగా
చదువుకొని, మంచి ఉద్యోగాలు చేయాలి. ఊరి బడిని బాగు చేసుకొనేందుకు అందరూ తోచినకాడికి సాయం చేయాలి.