కొండపాక (కుకునూరుపల్లి), జూన్ 28: సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయం దగ్గర పురాతన సరస్వతీ విగ్రహం వెలుగులోకి వచ్చింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యులు అహోబిలం కరుణాకర్, ఎండీ నసీర్, సామలేటి మహేశ్, కొలిపాక శ్రీనివాస్ బుధవారం కొండపాక పోచమ్మ ఆలయం దగ్గర రాష్ట్రకూటశైలి సరస్వతీ విగ్రహాన్ని గుర్తించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇలాంటి సరస్వతీ శిల్పాలు తెలంగాణలోని కొలనుపాక, నందికంది, వేల్పుగొండ, వరంగల్, ఇంద్రేశం, బాసరలో గుర్తించినట్టు తెలిపారు. చతుర్భుజి సరస్వతి అమ్మవారు నిజహస్తాలతో అక్షమాల, పుస్తకం, పరహస్తాలతో అంకుశం పాశాలు ఉండటంతో పాటు ఆసన స్థితిలో, వివిధ ఆభరణాలతో అలంకృతమై ఉన్నదని వారు పేర్కొన్నారు. జైనంలో సరస్వతి అమ్మవారిని శత్రుదేవి అంటారని వారు తెలిపారు.