రామగిరి, డిసెంబర్ 31: పురాతన శిలలు, కట్టడాలను కాపాడుకోవాలని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కోరారు. నల్లగొండ సమీపంలోని పానగల్ పరిసరాలు, వేంకటేశ్వరాలయం ఆవరణలోని శిథిలాలు, మెట్ల బావిని ఆదివారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. పానగల్లోని పచ్చల సోమేశ్వరాలయం ప్రవేశ ద్వారానికి కుడి వైపు ఉన్న మెట్ల బావికి 800 ఏండ్ల చరిత్ర ఉన్నదని, అది కందూరు చోళుల కాలం నాటి దిగుడు బావి అని తెలిపారు. గతంలో అనేకసార్లు పునర్నిర్మాణం చేశారని, ప్రస్తుతం శిథిలావస్థ్ధకు చేరిందని, చారిత్రక ప్రాధాన్యత కలిగిన వీటిని కాపాడుకోవాలని సూచించారు. ఎనిమిది శతాబ్దాల ఈ చారిత్రక ఆనవాళ్లపై అవగాహన కల్పించి భావితరాలకు అందించాలని విజ్ఞప్తి చేశారు.