Kesamudram | కేసముద్రం, మార్చి 21: ఇసుకలారీ డ్రైవర్పై ఇద్దరు కానిస్టేబుళ్లు దౌర్జన్యం చేశారు. కేసముద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లో బట్టలూడదీసి దాడి చేశారు. కానిస్టేబుళ్లు దాడి చేస్తుండగా చెడ్డి మాత్రమే ఉన్న డ్రైవర్ ఫొటో వైరల్ కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోదావరి నుంచి ఇసుకలారీలు మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి వస్తాయి.
నిబంధనల ప్రకారం12 టైర్లు కలిగి ఉన్న లారీలో 27 టన్నులు, 14 టైర్లు కలిగి ఉన్న లారీలో 29 టన్నులు, 16 టైర్లు కలిగి ఉన్న లారీలో 40 టన్నుల ఇసుక తీసుకురావాల్సి ఉంటుంది. అయితే లారీ డ్రైవర్లు కొంత మంది లారీలో అధికంగా ఇసుకను తీసుకువస్తుంటారు. ఈ నెపంతో కొందరు కానిస్టేబుళ్లు ఇసుక లారీలను నిలిపి పరిమితికి మించి ఇసుక తీసుకువస్తున్నారనే నెపంతో మామూళ్లు వసూళ్లు చేస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి.
అయితే మహబూబాబాద్లో ఇల్లు కట్టుకుంటున్న ఓ కానిస్టేబుల్, వారం రోజుల క్రితం సదరు లారీ డ్రైవర్ను ఇసుక అడిగినట్లు సమాచారం. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరుగగా లారీ డ్రైవర్ను ఇద్దరు కానిస్టేబుళ్లు బట్టలూడదీసి దాడికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. మామూళ్లు, ఇసుక ఇవ్వలేదనే నెపంతోనే నడిసెంటర్లో బట్టలూడదీసి దౌర్జన్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఫొటో వైరల్ కావడంతో పెట్రోలింగ్ సమయంలో డ్రైవర్ లారీని ఆపనందుకే కానిస్టేబుళ్లు వెంబడించి పట్టుకున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై ఎస్సై వంశీధర్ని వివరణ కోరగా ఈ ఘటన తన దృష్టికి వచ్చిందని, విచారణ చేసి పైఅధికారులకు నివేదిక అందించినట్లు తెలిపారు.