Elections | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): గత లోక్సభ ఎన్నికల్లో (2019) బీజేపీ 303 స్థానాలను గెలుచుకొన్నది. ఇందులో దాదాపు 100 స్థానాలు స్వల్ప మెజారిటీతో గెలిచినవే కావడం విశ్లేషకులను అప్పట్లో ఆలోచనలో పడేసింది. ఎన్నికల ప్రక్రియలో ఏమైనా అవకతవకలు జరిగాయా? ఈవీఎంల మ్యానిప్యులేషన్ జరిగిందా? అన్న పలు సందేహాలకు కారణమైంది. అయితే, ఈ వార్తలను అటు ఎన్నికల సంఘం (ఈసీ), ఇటు అధికార బీజేపీ కొట్టిపారేశాయి. అయితే, 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అవకతవకలకు పాల్పడిందని, తద్వారా మెజారిటీ స్థానాల్లో గెలిచిందని అశోకా యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సభ్యసాచి దాస్ చెబుతున్నారు. ఈ మేరకు ఓ పరిశోధనాత్మక పత్రాన్ని ఆయన వెలువరించారు. వచ్చే ఏడాది లోక్సభకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ పరిశోధనపత్రం వెలువడటం ప్రస్తుతం సంచలనంగా మారింది.
పరిశోధన జరిగింది ఇలా..
2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అవకతవకలకు పాల్పడిందా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకోవడానికి 1977 నుంచి 2019 మధ్య జరిగిన లోక్సభ ఎన్నికల్లోని ఓటింగ్ సరళి, ఫలితాలను సభ్యసాచి విశ్లేషించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలలో నమోదైన పోలింగ్ శాతం, వీవీప్యాట్ల సంఖ్య, జాతీయ ఎన్నికల సర్వే గణాంకాలు, కౌంటింగ్ సెంటర్లలో పర్యవేక్షకులు ప్రకటించిన ఫలితాలు, స్వల్ప ఆధిక్యతతో బీజేపీ గెలిచిన స్థానాలు, ఆ సీట్లు ఎక్కువగా ఏ రాష్ర్టాల్లో ఉన్నాయి? ఆయా స్థానాల్లో ముస్లింల జనాభా ఎంత? తదితర విషయాలను పరిగణనలోకి తీసుకొన్నారు. ఈ వివరాలన్నింటినీ క్రోడీకరించి ‘మెక్క్రారీ టెస్ట్’ను నిర్వహించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అవకతవకలకు పాల్పడినట్టు ఆ పరీక్షలో డెన్సిటీ మార్జిన్ల ద్వారా స్పష్టమైంది.
ప్రభావితం చేశారిలా..
స్వల్ప ఆధిక్యతతో బీజేపీ గెలిచిన స్థానాల్లో ఓటింగ్ శాతంలో కూడా అసాధారణ పరిస్థితులను కనుగొన్నట్టు పరిశోధన పత్రం వెల్లడించింది. ముస్లింల జనాభా ఎక్కువగా ఉండి, గెలువడం సాధ్యంకాదన్న స్థానాల్లో అవకతవకలు తక్కువగా గుర్తించామని, పోటీ ఎక్కువగా ఉండి, ముస్లిం ఓటర్లు తక్కువగా ఉన్న స్థానాలో మ్యానిప్యులేషన్ రేటు ఎక్కువగా జరిగినట్టు తెలుస్తున్నదని ప్రొఫెసర్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి బీజేపీకి ఈసీ కూడా సాయం చేసిందంటూ సభ్యసాచి పత్రంలో ఆరోపించారు. ఎన్నికల షెడ్యూల్ నిర్ణయం, ఉద్దేశపూర్వకంగా ముస్లిం ఓటర్లను తొలగించడం తదితర చర్యలకు ఈసీ పాల్పడినట్టు చెప్పారు.
ఏమిటీ ‘మెక్క్రారీ టెస్ట్’?
స్వతంత్రంగా జరుగాల్సిన ఏదైనా ఓ ప్రక్రియపై బయటి వ్యక్తుల ప్రభావం ఉన్నదా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి మెక్క్రారీ పరీక్షను వినియోగిస్తారు. ఈ పరీక్షను స్థూలంగా ఇలా అర్థం చేసుకోవచ్చు. పరీక్షలో భాగంగా ఓ కటాఫ్ పాయింట్ను జీరోగా గుర్తిస్తారు. అప్పటికే ఉన్న డాటా సాయంతో జీరోకు ఇరువైపులా డెన్సిటీ మార్జిన్ పాయింట్లను కలుపుతూ ఓ గీతగా గీస్తారు. చార్ట్పై గీసిన గీత మైనస్ నుంచి ప్లస్ వైపునకు సాగుతుంది. గీత తెగిపోకుండా జీరోను దాటి ఒక క్రమపద్ధతిలో సాగుతున్నట్లయితే.. అవకతవకలు జరగనట్లు భావించాలి. ఒకవేళ జీరో పాయింట్ దగ్గర గీత తెగిపోయి.. అసాధారణరీతిలో మార్జిన్ పెరుగడం లేదా తగ్గడం జరిగితే అవకతవకలు జరిగినట్లు భావించాలి. బీజేపీ స్వల్ప మెజారిటీతో గెలిచిన స్థానాలను ‘మెక్క్రారీ టెస్ట్’లో విశ్లేషించగా.. మార్జిన్ జీరో వద్ద తెగిపోయి అసాధారణస్థితిలో పెరిగినట్టు కనిపించింది. ముఖ్యంగా బీజేపీపాలిత రాష్ర్టాల్లో ఇది మరీ ఎక్కువగా నమోదైంది.
ఎవరీ సభ్యసాచి దాస్?
హర్యానాలోని అశోకా యూనివర్సిటీలో ఎకనమిక్స్ విభాగంలో సభ్యసాచి దాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. యేల్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ అందుకొన్నారు. పొలిటికల్ ఎకానమీ, పబ్లిక్ ఎకనమిక్స్, ఐప్లెడ్ మైక్రోఎకనమిక్స్లో ఈయన నిపుణులు. కరోనా వైరస్ నుంచి దీర్ఘకాలం రక్షణ పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గతంలో ఈయన ఓ పరిశోధన పత్రంలో వివరించారు.
గెలవడం సాధ్యంకాదన్న స్థానాల్లో అవకతవకలు తక్కువగా గుర్తించాం. ముస్లిం ఓటర్లు తక్కువగా ఉన్న స్థానాల్లో మ్యానిప్యులేషన్ రేటు ఎక్కువగా జరిగినట్టు తెలుస్తున్నది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి బీజేపీకి ఈసీ కూడా సాయం చేసింది.
– ప్రొఫెసర్ సభ్యసాచి దాస్