వర్ధన్నపేట : మరో నాలుగు రోజుల్లో అతని పెళ్లి జరగాల్సి ఉంది. వధూవరుల కుటుంబాలు పెళ్లి పనులతో బిజీబీజీగా ఉన్నాయి. ఇంతలో వరుడి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి శుభలేఖలు పంచేందుకు వెళ్లిన అతను అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇది హత్యా లేదంటే ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా గోకుల్నగర్కు చెందిన భూక్య కృష్ణతేజ (29) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి ఈ నెల 16న నర్సంపేటకు చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 10న పెళ్లి పత్రికలు పంచడానికి ద్విచక్ర వాహనంపై ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన కృష్ణతేజ రాత్రయినా తిరిగి రాలేదు.
కుటుంబ సభ్యులు, బంధువులు వెతుకగా సోమవారం ఉదయం పలివేల్పుల దగ్గర ఎస్సారెస్పీ కాలువ పక్కన కృష్ణతేజ ద్విచక్ర వాహనం కనిపించింది. దాంతో కుటుంబసభ్యులు వెంటనే కేయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వర్ధన్నపేట మండలం కుమ్మరిగూడెం శివారులోని ఎస్సారెస్పీ కాలువలో మంగళవారం గుర్తుతెలియని మృతదేహం ఉందని సమాచారం అందింది.
వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన కేయూ పోలీసులు కృష్ణతేజ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు ఆ మృతదేహం కృష్ణతేజదే అని నిర్ధారించారు. దాంతో కేయూ పోలీసులు కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు వర్ధన్నపేట ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. అయితే కృష్ణతేజ ఆత్మహత్య చేసుకున్నాడా..? లేదా ఎవరైనా హత్య చేశారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసుల తెలిపారు.