హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కాళ్లు, చేతులు కోల్పోయిన దివ్యాంగులకు లక్షల రూపాయల ఖరీదైన కృత్రిమ అవయవాలను ఉచితంగా అందజేస్తున్న తీరును అంతర్జాతీయ మెడికల్ జర్నల్ గుర్తించింది. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అందిస్తున్న అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ లింబ్స్ చికిత్స తీరు ను ‘హాంకాంగ్ ఆర్థోపెడిక్ జర్నల్’లో ప్రచురించింది. వివిధ కారణాలతో కాళ్లు, చేతులు కోల్పోయిన వారికి నిమ్స్లోని ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు డాక్టర్ మహేశ్వర్ లక్కిరెడ్డి, డాక్టర్ నగేష్ చెరుకూరి, డాక్టర్ గంగాధర్, డాక్టర్ మనోహర్, డాక్టర్ రాజు, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ మధులత తమ వైద్యబృందం సహకారంతో 2017నుంచి ‘అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ లింబ్స్’ను అమర్చడం ప్రారంభించారు. అప్పటి నుంచి అంతర్జాతీయ జర్నల్కు నివేదించే వరకు 136 మంది రోగులకు 142 కృత్రిమ అవయవాలను అమర్చగా ఇప్పటి వరకు మొత్తం 220 మందికి అమర్చారు.
సాధారణంగా అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ లింబ్ ఖరీదు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు, ఎలక్ట్రానిక్ లింబ్స్ ఖరీదు రూ.20 లక్షల వరకు ఉంటుంది. అంత ఖర్చును భరించలేని నిరు పేదల కోసం కేవలం రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర లోపు ఖర్చుతోనే చేయించి, అదీ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఉచితంగా అమర్చడం ప్రారంభించారు. పేరుగాంచిన అంతర్జాతీయ కంపెనీలైన ఎల్డోలైట్, బయోనిక్ వంటి కంపెనీలు తయారు చేసిన నాణ్యమైన కృత్రిమ అవయవాలను బల్క్గా కొనుగోలు చేయడంతో వారు మరింత డిస్కౌంట్తో వాటిని అందజేస్తున్నారు. వీటికి మూడు సంవత్సరాల వారంటీ కూడా ఉండటం విశేషం.
అంతర్జాతీయ మెడికల్ జర్నల్కు పంపిన నివేదిక ప్రకారం మొత్తం 136 మందికి 142 ఆర్టిఫిషియల్ లింబ్స్ను అమర్చారు. ఎలక్ట్రానిక్ చిప్స్, బ్యాటరీలతో కూడిన ఎలక్ట్రానిక్ లింబ్స్ను సైతం తొలిసారిగా నిమ్స్ వైద్యులు అందుబాటులోకి తీసుకువచ్చారు. సుమారు రూ.20 లక్షల ఖరీదైన ఈ అవయవాలు రోగులకు ఎంతో ఉపయోగపడటమే కాకుండా వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నాయి. నిమ్స్లో అమరుస్తున్న అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ లింబ్స్పై రోగుల్లో 90 శాతం సంతృప్తి వ్యక్తమవుతుండటాన్ని సైతం అంతర్జాతీయ జర్నల్ గుర్తించింది.