కోహెడ, మార్చి 5: వ్యవసాయ బావి వద్ద నీళ్ల తగాదాలతో ఓ అన్న.. తమ్ముడిని నరికి చంపాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లిలో మంగళవారం చోటుచేసుకున్నది. వింజపల్లికి చెందిన కొమ్ముల శ్రీనివాస్రెడ్డి (35), తిరుపతిరెడ్డి అన్నదమ్ములు. మంగళవారం తిరుపతిరెడ్డి బావి వద్ద ఉన్న వేప చెట్టును కూలీలను తీసుకొచ్చి కొట్టించాడు. విషయం తెలుసుకున్న తమ్ముడు శ్రీనివాస్రెడ్డి బావి వద్దకు వెళ్లి చెట్టును ఎందుకు కొడుతున్నావని అడిగాడు.
అప్పటికే తండ్రి ఆస్తిగా వచ్చిన వ్యవసాయ బావి ఇద్దరి పొత్తుల ఉంది. అప్పటికే నీళ్ల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండటంతో క్షణికావేశానికి గురైన తిరుపతిరెడ్డి తమ్ముడు శ్రీనివాస్రెడ్డిని అక్కడే ఉన్న గొడ్డలితో మెడపై నరికాడు. గొడ్డలికాటు తీవ్రంగా ఉండటంతో శ్రీనివాస్రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నీళ్లు, చెట్టు కొట్టే విషయంలో ఇద్దరు గొడవ పడ్డట్టు సమాచారం. విషయం తెలుసుకున్న ఎస్సై తిరుపతి, సీఐ ఎర్రల కిరణ్, ఎసీపీ సతీశ్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.