ములుగు : ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి బోగత జలపాతం లో నీట మునిగి ఓ యువకుడు మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఉయ్యూరు గ్రామానికి చెందిన అనిల్ కృష్ణ (25) అనే యువకుడు హైదరాబాదులోని గచ్చిబౌలి ప్రాంతంలో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో స్నేహితులతో కలిసి బోగత జలపాతానికి విహారయాత్రకు చేరుకున్నారు.
జలపాత ప్రాంగణంలో స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయాడు. స్నేహితులు ప్రాణాలకు తెగించి అనిల్ కృష్ణను ఒడ్డుకు చేర్చారు. అయితే విపరీతంగా నీళ్లు తాగడంతో కొన ఊపిరితో ఉన్న స్నేహితుడిని వాజేడు వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి మార్గమధ్యలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటన విషయం తెలుసుకున్న వాజేడు ఎస్సై హరీష్ అక్కడికి చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.