హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): రోజంతా ప్రకృతి ఒడిలో సేదతీరేలా, అటవీ అందాలు ఆస్వాదించేలా అమ్రాబాద్ ఫారెస్ట్ రిజర్వ్లో ‘వైల్డ్ లైఫ్ టూరిజం’ సరికొత్త హంగులు దిద్దుకొంటున్నది. తెలంగాణలో పెద్దపులుల అభయారణ్యంగా పేరుగాంచిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో ఈ యాత్ర నవంబర్ 2వ వారంలో మొదలుకానున్నది. ఏటీఆర్లోని ఫర్హాబాద్లో టైగర్ సఫారీని ఏడాదికొకసారి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు వైల్డ్లైఫ్ టూరిజం ప్యాకేజీ టూర్ను గతేడాది నవంబర్ 14న ప్రారంభించగా, ఈ ఏడాది మరిన్ని సౌకర్యాలతో అటవీశాఖ సన్నద్ధమైంది. కొత్తగా 8 వాహనాలను కొనుగోలు చేయడంతోపాటు పూర్తిస్థాయిలో ఆదివాసీలకు ఉపాధి కల్పించేలా వారిని డ్రైవర్లు, టూరిస్ట్ గైడ్లుగా నియమించారు. ఈ ప్యాకేజీ టూర్ను అటవీశాఖ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు.
రోజంతా ఎంతో హాయిగా..
ఈ టూర్లో టైగర్ సఫారీ ట్రెక్కింగ్, ఫారెస్ట్ స్టడీటూర్, ఆదివాసీలను స్వయంగా కలిసి జీవనశైలి తెలుసుకోవడంతోపాటు మరిన్ని అదనపు ఆకర్షణలను జతచేస్తున్నారు. దాదాపు 24 గంటలపాటు అడవిలో వన్యప్రాణుల మధ్య సేదతీరేలా రూపకల్పన చేశారు. రాత్రిపూట అడవిలోనే కాటేజీలు, మట్టి ఇండ్లలో బసతో కొత్త అనుభూతి ఇచ్చేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో తొలుత అడవులు, జంతువుల పరిరక్షణ, పచ్చదనం పరిరక్షణకు అటవీశాఖ చేపడుతున్న కార్యక్రమాలను లఘుచిత్రాల ద్వారా తెలియజేస్తారు. అనంతరం అడవిలో ట్రెక్కింగ్కు తీసుకెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చి కాటేజీల్లో బస కల్పిస్తారు. మరుసటిరోజు పొద్దునే టైగర్ సఫారీకి తీసుకెళ్లడంతో టూర్ ముగుస్తుంది.
టైగర్ సఫారీకి 8 కొత్త వాహనాలు
గతేడాదితో పోలిస్తే కొత్తగా 8 కాటేజీలు సిద్ధం చేశారు. టైగర్ సఫారీకి అనువుగా 8 నూతన వాహనాల్లో విహరించేలా ఏర్పాట్లు చేశారు. గతేడాది టైగర్ సఫారీని మొదలు పెట్టినప్పుడు 8 సందర్భాల్లో సందర్శకులకు 8 పులులు కనిపించాయని, ఈ ఏడాది సఫారీ ఏరియాలో కాకు ండా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో పులులను చూడొచ్చని డీఎఫ్వో రోహిత్ తెలిపారు.
నల్లమలలో పెరిగిన పులులు
పులుల సంరక్షణ విషయంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. పులుల సంఖ్య క్రమంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. తెలుగు రాష్ర్టాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవుల్లో పులుల సంఖ్య భారీగా పెరిగినట్టు ఈ ఏడాది జరిగిన పులుల గణన ద్వారా వెల్లడైంది. రాష్ట్ర విభజన నాటికి 44 ఉన్న పులుల సంఖ్య నేడు 96కి పెరిగాయి. వీటిలో మగ పులుల కంటే ఆడ పులులే అధికం. దీనివల్ల రాబోయే కాలంలో పులుల సంఖ్య మరింత పెరుగుతుందని అటవీశాఖ ఆశాభావం వ్యక్తంచేస్తున్నది. ప్రస్తుతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో 23కు పైగా, నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో 73 పులులు ఉన్నట్టు కెమెరా ట్రాప్ల ద్వారా గుర్తించారు. 2014లో రాష్ట్ర విభజన సమయానికి అమ్రాబాద్లో 7, నల్లమలలో 37 పులులు ఉండేవి.