హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి సొంతగడ్డ సంస్కృతినే మరిచారని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు విమర్శించారు. తెలంగాణ పోరాటాన్ని ఢిల్లీ వేదికగా అవహేళన చేయడంపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ విముక్తి కోసం అల్లూరి సీతారామరాజు పోరాడారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్షా చరిత్రపై కనీస అవగాహన లేకుండా చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే యావత్ తెలంగాణ నిప్పులు చెరుగుతున్నది.
ఢిల్లీలో జరిగిన రాష్ర్టావిర్భావ వేడుకల్లో అమిత్షా ఈ వ్యాఖ్యలు చేయగా.. అదే కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ఉద్యమంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్లో అల్లూరి ఫొటోలు పెట్టడం అందరినీ విస్మయపరిస్తే.. వాటి పక్కన నిలబడి మరీ కిషన్రెడ్డి ఫొటోలు దిగడం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. దీంతో అమిత్షా చేసిన తప్పుడు వ్యాఖ్యలను కిషన్రెడ్డి సరిచేసే పనిలో పడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ‘నిజాం కుటుంబానికి చెందినవారు, నేటి రజాకార్లతో జతకట్టేవారు మాత్రమే భారతదేశానికి స్వాతంత్య్రం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన కృషిని ప్రశ్నిస్తారు.
దేశమంతటా బ్రిటిష్ వారితో పోరాటానికి గిరిజనులను ప్రేరేపించిన నాయకుడిగా, ఆయన నిజాం ప్రాంతంలోని గిరిజనులతో సహా గిరిజన హక్కుల కోసం పోరాడారు’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ శుక్రవారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ‘అల్లూరి సీతారామరాజు లాంటి యోధుడిని మేమంతా గౌరవిస్తాం. కాకపోతే తెలంగాణ చరిత్రపై మీకున్న అవగాహన చూస్తుంటే జాలేస్తున్నది..’అంటూ కేటీఆర్ దీటుగా బదులిచ్చారు.
‘సంస్కృతి లేని మంత్రి కిషన్రెడ్డీ, ఇతర గుజరాత్ గులాములూ… తెలంగాణ చరిత్రపై మీకున్న దయనీయమైన అవగాహన చూస్తే జాలేస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో మేమంతా రాజీనామాలు చేస్తే.. చేయకుండా పారిపోయిన వాళ్లలో నువ్వూ ఉన్నావన్న విషయాన్ని మరిచిపోయాను..’ అని ట్వీట్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు మద్దతుగా నెటిజన్లు సైతం కిషన్రెడ్డి వ్యవహారశైలిని ఎండగట్టారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉండటమే మీ పార్టీ సిద్ధాంతమా..? అయినా రాజీనామా చేయకుండా పారిపోయిన నీకు తెలంగాణ చరిత్ర ఎలా తెలుస్తుంది?’ అంటూ కిషన్రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రజాస్వామిక పోరాట చరిత్ర లేని బీజేపీ ఏకైక బలం అబద్ధాలు ఆడటం, దాడులు చేయడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ఎనిమిదేండ్లుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏమాత్రం పట్టించుకోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ సారి ఢిల్లీలో ఒక కార్యక్రమం నిర్వహించి చరిత్ర వక్రీకరణకు పాల్పడింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్లో మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు ఫొటోలను ప్రదర్శించారు.
వీటిని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో కలిసి సందర్శించిన హోంమంత్రి అమిత్షా విచిత్ర వ్యాఖ్యలతో తన అజ్ఞానాన్ని బయటపెట్టుకొన్నారు. అల్లూరి సీతారామరాజు తెలంగాణ విముక్తి కోసం రాంజీగోండు, కుమ్రంభీంతో కలిసి నిజాంపై పోరాటం చేశారంటూ చరిత్రకు కొత్త భాష్యం చెప్పారు. ఈ ఫొటో ఎగ్జిబిషన్పై టీఆర్ఎస్ నాయకుడు క్రిశాంత్ ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. భారత హోంమంత్రికి, సాంస్కృతిక శాఖ మంత్రికి తెలంగాణ చరిత్రపై అవగాహన లేదని ట్వీట్ చేశారు.
దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీపై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ‘వాట్సాప్ యూనివర్సిటీలో శిక్షణ పొందితే కలిగే దుష్ప్రభావాలు ఇలాగే ఉంటాయి. ప్రజాస్వామ్య పోరాట చరిత్ర లేని పార్టీ బీజేపీ. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో, తెలంగాణ ఏర్పాటులో ఆ పార్టీ పాత్ర ఏమీ లేదు. ఆ పార్టీ ఏకైక బలం డబుల్ ఇంజిన్ అబద్ధాలు మాట్లాడటం, దాడులు చేయడం’ అని ట్వీట్ చేశారు.