హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై అమెరికాకు చెందిన ఎన్జీవో ల్యాటర్ డిసెన్స్ సంస్థ (ఎల్డీఎస్) ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. సంస్థ ప్రతినిధులు లూక్ డార్స్, జాన్సన్, జాన్ గుట్టి, ఆసియా సభ్యులు జితేందర్, శంకర్లూక్ తదితరులు గతకొద్దిరోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇటీవలనే ధర్మపురి నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. తాజాగా హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్లో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను సోమవారం ప్రత్యేకంగా కలిశారు.
రాష్ట్రంలో విద్యా, వైద్యం, వ్యవసాయం, సాగునీరు తదితర రంగాలకు సంబంధించి అమలవుతున్న ప్రభుత్వ పథకాలను సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రశంసించారు. తమవంతుగా ఆయా రంగాలకు మానవతా సహాయం అందజేస్తామని మంత్రి కొప్పులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ నెల 18 నుంచి మార్చి 3వ తేదీ వరకు అమెరికాలో నిర్వహించనున్న రూట్స్ టెక్ ఎక్స్ పో-2023లో తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరుకావాలని మంత్రి కొప్పులను ఎన్జీవో ప్రతినిధులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. అనంతరం ఎల్డీఎస్ సభ్యులకు మంత్రి మెమెంటోలు అందజేసి శాలువతో మంత్రి కొప్పుల సత్కరించారు.