హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): మోటర్ వాహన చట్టం నూతన విధివిధానాలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. నూతన నిబంధనల ప్రకారం థర్డ్పార్టీ ఇన్సూరెన్స్, క్లెయిమ్స్కు సంబంధించిన మోటర్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ సైతం అమల్లోకి వచ్చింది. మోటర్ వెహికిల్ సవరణ చట్టం 2019లోని సెక్షన్ 50 నుంచి 57 వరకు, సెక్షన్ 93ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ సెక్షన్లు అన్నీ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. పాత చట్టంలోని చాప్టర్ 10 పూర్తిగా తొలగించారు. దీనిలో మోటారు వాహనాల థర్డ్పార్టీ రిస్క్ ఇన్సూరెన్స్కు సంబంధించి మార్పులు చేస్తూ చాప్టర్ 11ను సవరించారు. అదేవిధంగా మోటర్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఎదుట క్లెయిమ్స్ నమోదుకు సంబంధించిన ఎంవీయాక్ట్ 1988లోని సెక్షన్ 163, 166, 168, 169లో అవసరం మేరకు మార్పులు చేశారు. దీని ప్రకారం హిట్ అండ్ రన్ కేసుల్లో నష్టపరిహారం పెంచారు. గతంలో రూ.25 వేలు ఉండగా, దాన్ని రూ.2 లక్షలకు పెంచారు. గాయపడినవారికి గతంలో రూ.12,500 పరిహారం ఉండగా దాన్ని రూ.50 వేలకు పెంచారు. బాధితులకు నష్టపరిహారం చెల్లింపుల్లో ఎలాంటి జాప్యానికి తావులేకుండా చూసేందుకు నూతన సవరణలు ప్రవేశపెట్టారు. ఎంవీయాక్ట్ సెక్షన్ 163 ఏ కూడా సవరించారు. దీని ప్రకారం రోడ్డు ప్రమాదానికి కారణమైన నిందితుడు గుర్తించిన సందర్భంలో.. ఆ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల పరిహారం, తీవ్రంగా గాయపడితే రూ. 2.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగిన ఆరు నెలల్లోపే క్లెయిమ్ను ఫైల్ చేసుకునేలా సెక్షన్ 166కు సవరణ తెస్తూ సబ్ సెక్షన్ (3) చేర్చారు. మోటర్ వెహికిల్ యాక్సిడెంట్ ఫండ్ను సెక్షన్ 164బీ ద్వారా చేర్చారు. దీని ప్రకారం వాహనదారుల నుంచి ఈ మొత్తాన్ని స్పెషల్ ట్యాక్స్ లేదా సెస్ రూపంలో వసూలు చేస్తారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ ఉపశమనం కోసం ఇచ్చే పరిహారం కోసం దీన్ని వినియోగిస్తారు. బాధితుడికి తర్వాత ట్రిబ్యునల్ ఇచ్చే పరిహారం నుంచి ఈ మొత్తాన్ని మినహాయించుకుంటారు.